అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాలకు ఏకపక్షంగా రీపోలింగ్కు ఆదేశించడంపై ఈసి వద్ద సాయంత్రం నిరసన తెలియజేయనున్నారు.
చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారాన్ని తప్పుపడుతూ నిన్న చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు.
ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తి పల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామాపురం గ్రామాల్లో గత నెల 11న ఎస్సిలను ఓటేయనివ్వలేదనీ, కాబట్టి రీపోలింగ్ నిర్వహించాలని వైసిపి అభ్యర్థై చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన తరువాత చంద్రబాబు ఢిల్లీలో విపక్ష నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్యాదవ్, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను చంద్రబాబు కలిసి రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి లక్నో వెళ్లి మాయావతితో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 23న ఫలితాల తర్వాత కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. రేపు కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉందని టిడిపి వర్గాలు తెలిపాయి.