తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకుల్లో దేవినేని ఉమ ఒకరు. పార్టీ వాణిని బలంగా వినిపిస్తూ.. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను, మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇరుకున పెట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తూంటారు. ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందుకు ఆధారాలతో సహా తీసుకొస్తూ ఉంటారు. దీంతో దేవినేని ఉమను అరెస్టు చేసేందుకు సరైన ఆధారాల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కొన్ని టెండర్లలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయనపై గుడివాడలో ఓ కేసు నమోదైంది. దీంతో ఉమా అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
దేవినేని ఉమా మేనల్లుడు.. ఎవరా వంశీ?
ఉమ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మేనల్లుడిగా నాదెళ్ల వంశీకృష్ణ కాన్వాయ్లోనే ఉండేవాడని తెలుస్తోంది. ఆ సమయంలో వంశీ చేసిన అనేక అక్రమాలకు పాల్పడ్డాడని అంటున్నారు. వాటిని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఉమపై రాజకీయంగా ఉచ్చు బిగించాలనేది వ్యూహంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కొద్దిరోజుల క్రితమే జగన్ను కలసి అనుమతి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమా వ్యవహారాన్ని ప్రభుత్వంలోని కీలక వ్యక్తికి అప్పగించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వంలో పనులు, ఉద్యోగాలు అంటూ వంశీ డబ్బులు వసూలు చేసేవాడని.. ఇందుకు ఉమ పేరు వాడుకునేవాడని తెలుస్తోంది.
వంశీ చేసిన పనులు.. ఉమకు చుట్టుకుంటున్నాయి..
ఉమా పేరుతోనే కాకుండా లోకేశ్, కేఈ కృష్ణమూర్తి పేర్లు కూడా ఉపయోగించి వంశీ దందాలు చేసాడని తెలుస్తోంది. విజయవాడ రూరల్ పరిధిలోని వరలక్ష్మిపురం, తులసీనగర్కు చెందిన నాదెళ్ల వంశీకృష్ణ.. గతంలో ఏసీబీకి చిక్కిన ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేశారన్న ఫిర్యాదులున్నాయి. గుంటూరు, కర్నూలుకు చెందిన పోలీసు, దేవాదాయ శాఖల ఉద్యోగుల నుంచి లక్షలు వసూలు చేశాడని తెలుస్తోంది. దేవినేని ఉమ ఇంట్లోనే వంశీకి డబ్బులు ఇచ్చామని బాధితులు సదరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో కొన్నింటికి వంశీ తల్లిదండ్రులు చెక్కులిచ్చినా బౌన్స్ అయ్యాయని.. మరికొన్నింటిని ఉమ స్వయంగా సెటిల్ చేశారని అంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలోనే వంశీ అక్రమాలను బాధితుల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఉమకు రాజకీయంగా ఉచ్చు బిగించి ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.