అమరావతి: రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్యయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేల విడిచి సాము చేశామా? క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించకుండా టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల కొంప మునిగిందా అన్న విషయాలపై పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని గోరంట్ల అభిప్రాయపడ్డారు. ఎార్టీ పరిస్థితిపై పలు మార్లు తాను ఆందోళన వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోలేదని గోరంట్ల పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి కుల ప్రస్థావన వచ్చిందని గోరంట్ల గుర్తు చేశారు. 23స్థానాలకే పరిమితం కావడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని గోరంట్ల వ్యాఖ్యానించారు.
ప్రమాణ స్వీకార మహోత్సవానికి చంద్రబాబు లాంటి సీనియర్ నేతను ఇంటికి వచ్చి ఆహ్వనించి ఉంటే బాగుండేది అని గోరంట్ల అభిప్రాయపడ్టారు.బుధవారం జరిగిన టిడిఎల్పీ సమావేశంలో ఆయన ఆభిప్రాయాలను వ్యక్త పరిచారు.
సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దామని సూచించారు. ప్రజల కోపం వల్ల టిడిపి ఓటమి చెందలేదనీ, జగన్ పట్ల ఉన్న సానుభూతే ఆ పార్టీని గెలిపించిందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. శాసన సభలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
సమావేశం అనంతరం నిమ్మకాయల చిన రాజప్ప మీడియాతో మాట్లాడుతూ ఉప నేతలు, విప్ పదవులు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించామని తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామని చినరాజప్ప తెలిపారు. జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి పార్టీ ప్రతినిధిగా ఎవరు వెళ్లాలన్నది కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చినరాజప్ప అన్నారు.