వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం తన కల అని చెప్పుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల సాకారం కానుంది. బుధవారం ఆయన విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం అందుకు వేదిక కానుంది.
స్వామీ స్వరూపానంద్రేంద్ర నిర్ణయించిన ముహూర్తం మధ్యాహ్నం 12:23 గంటలకు జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
2009లో కాంగ్రెస్ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచీ అధికారం పీఠం చేజిక్కించుకునేంత వరకూ ఈ తొమ్మిదేళ్లలో జగన్ చాలా దూరం పయనించారు. ఈ ప్రయాణంలో ఆయన ఎదురుదెబ్బలు ఎన్నో తిన్నారు. అయితే ఏనాడూ గుండె నిబ్బరం కోల్పోలేదు. పట్టువదలని విక్రమార్కుడి లాగా ఒదార్పు యాత్ర చేశారు. మధ్యలో అవినీతి కేసులలో సిబిఐ అరెస్టు చేయడంతో 16 నెలలు జైలు జీవితం గడపాల్సివచ్చింది.
జైలు నుంచి విడుదల అయి వచ్చిన తర్వాత మళ్లీ ఓదార్పు యాత్ర కొనసాగించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికలలో గెలుపు తధ్యం అన్న ధీమాతో పోటీ చేశారు. అయితే నవ్యాంధ్రకు కెప్టెన్గా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయడు ఉంటే బావుంటుందని అప్పుడు మెజారిటీ ప్రజలు నిర్ణయించడంతో జగన్ కల నెరవేరలేదు.
ఒక ప్రాంతీయ పార్టీ పోటీ చేసిన మొదటి ఎన్నికలలో విజయం సాధించకపోతే ఇక దాని మనుగడ దాదాపుగా కష్టం. కానీ ఆంద్రప్రదేశ్లో విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పూర్తిగా నేలమట్టం కావడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తున్న వైసిపి ఆ ఇబ్బందిని అధిగమించింది. మధ్యలో చంద్రబాబు వైసిపి శాసనసభ్యులను తన పార్టీలోకి ఫిరాయింపజేయడం జగన్ నాయకత్వానికి సవాలుగా నిలిచింది. ఆయన దీనిని చంద్రబాబుపై ఎదురుదాడికి ఉపయోగించుకున్నారు. చంద్రబాబు నైతిక విలువలు లేని రాజకీయం చేస్తున్నాడంటూ మొత్తం వైసిపి శాసనసభా పక్షం అసెంబ్లీని బహిష్కరించింది.
పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు 2017లో జగన్ తన తండ్రి బాట ఎంచుకున్నారు. నవంబర్ ఆరవ తేదీన ప్రజాసంకల్ప యాత్ర మొదలయింది. చివరికి అది అప్పటికి మరెవరూ చేయనంత దీర్ఘపాదయాత్రగా మారింది. 3600 కిలోమీటర్లకు పైగా నడిచిన జగన్ ఈ సంవత్సరం జనవరి పదవ తేదీన తన యాత్రను ముగించారు.
తన ఎన్నికల ప్రణాళికను ఆయన పాదయాత్రలోనే ప్రకటించారు. ఆయన ఇచ్చిన తొమ్మిది ప్రధానమైన హామీలకు నవరత్నాలు అని పేరు పెట్టారు. 2014 ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ 2019 ఎన్నికలలో దేనినీ తేలికగా తీసుకోలేదు. ఆయన ముందే ఎంపిక చేసుకున్న ఎన్నికల నిపుణుడు ప్రశాంత్ కిషోర్ దేనినీ తేలికగా తీసుకోనివ్వలేదు. టికెట్ల ఖరారులో కూడా ఆయన చెప్పిన సలహకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. అన్నీ లెక్క ప్రకారం చేశారు. ఎన్నికల నిర్వహణలో దిట్ట అన్న పేరున్న చంద్రబాబును మించి పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ ముగించారు. ఫలితం అందరికీ తెలిసిందే. కనీవినీ ఎరుగని మెజారిటీ. పార్టీని అందలం ఎక్కించిన జగన్ మోహన్ రెడ్డి తద్వారా తన కలను సాకారం చేసుకోగలిగారు.