అమరావతి: మోది, షాలను చూసి ప్యాంట్ తడుపుకుంటున్నది ఎవరో మోది తిరుపతి పర్యటనలో ప్రజలంతా చూశారని టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ప్రధాని మోది, హోంమంత్రి అమిత్షాలను చూసి టిడిపి అధినేత చంద్రబాబు భయంతో వణికిపోతున్నారంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విజయసాయిరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మెడలు వంచుతామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు నడుం వంచి కాళ్లు పట్టుకుంటున్న వాళ్లు కూడా ధైర్యం గురించి మాట్లాడితే ఆ ధైర్యానికి కూడా దరిద్రం పట్టుకుంటుందని బుద్దా అన్నారు.
దరిద్రానికి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని మీ ప్రభుత్వ వెబ్ సైట్లోనే ఉంది చూసుకోండి అని బుద్దా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నా రాష్ట్రంలో వర్షం లేదని బుద్దా అన్నారు. వరదని రాజకీయం చెయ్యాలని వేలుపెట్టి రాయలసీమ రైతులకు చుక్క నీరు లేకుండా చేశారని బుద్దా విమర్శించారు.
విజయసాయిరెడ్డి చెత్త ఐడియాలతో అమెరికా టూర్ మొత్తం తుస్సుమందని బుద్దా విమర్శించారు. ఆయన ఆమెరికా నుండి వచ్చే లోపు మీరు వెళ్లి రైతుల బుగ్గలు నిమిరే పని మొదలు పెట్టుకోవాలని విజయసాయిరెడ్డికి బుద్దా సూచించారు.