ఇప్పుడు అందరి నోటా ఒకే మాట. నయనతార తప్పు చేస్తోందని. చిన్నా చితకా విషయాల్లో తప్పులు జరిగితే ఫర్వాలేదుగానీ, ఏకంగా మెగాస్టార్ విషయంలోనే తప్పు జరగడం బాధాకరమని అందరూ అంటున్నారు. ఇంతకీ నయనతార చేసిన తప్పేంటనేగా మీ అనుమానం. ఆమె ప్రమోషన్ ఈవెంట్కు రాకపోవడం. సినిమా చేయడంతోనే తన బాధ్యత అయిపోయినట్టు ఫీలవడం. సినిమా చేసిన తర్వాత టాప్ హీరోయిన్లందరూ తమ సినిమాలను దగ్గరుండి ప్రమోట్ చేసుకుంటారు. కానీ `తులసి` సమయం నుంచే తాను ప్రెస్మీట్లకు రానని ఖరారుగా చెప్పి అగ్రిమెంట్ చేయించుకుంటోంది నయనతార. ప్రెస్ ముందుకు వస్తే లేని పోని ప్రశ్నలు అడుగుతారని ఆమె ఆలోచన. శింబుతో విడిపోయిన తర్వాత ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది. వ్యక్తిగత జీవితాన్ని నలుగురి ముందు బాహాటంగా చెప్పుకోలేకపోయినంతమాత్రాన సినిమా ప్రమోషన్లకు అటెండ్ కాకపోవడం న్యాయమా అని అడిగేవారూ లేకపోలేదు. అయినా డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది నయన్ వ్యవహారం.
మామూలు సినిమాలకు అలా జరిగితే ఫర్వాలేదుకానీ, చిరంజీవి సినిమాకు అలా జరగడం అన్యాయమే. ప్యాన్ ఇండియా సినిమాగా, ఐదు భాషల్లో రూపొందిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పట్టపు రాణిగా నటించిన నయనతార ఈ ప్రమోషన్లకు హాజరుకాకపోవడం పట్ల మెగాభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన తమన్నా మాత్రం ముంబైలో జరిగిన విలేకరుల సమావేశానికి హాజరయ్యారు. నిజానికి తమన్నా ముంబై వాసులకు తెలుసు. ఆమె మూలాలు అక్కడివే. కానీ నయనతార దక్షిణాది అమ్మాయి. ముంబై ప్రజలకు తెలియదు. పైగా ఆమె ముంబై ప్రెస్మీట్కు వెళ్లడం వల్ల ఒరిగేదేమీ లేదన్నది కూడా అంగీకరించాల్సిన విషయమే.
కానీ దక్షిణాదిన నయనతారకు క్రేజ్ ఉంది. మలయాళం, తెలుగు, కన్నడలో నయనతారకు లెక్కకు మించి అభిమానులే ఉన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా ఆమె ప్రమోషన్లలో పాల్గొంటే బావుంటుంది. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించాల్సి ఉంటుందని ప్రముఖుల మధ్య చర్చలు జరుగుతున్నాయట.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!