ఓపక్క దేశంలో ఏపీ పోలీసులు తమ పని తీరుతో అనేక అవార్డులు దక్కించుకుంటున్నారు. ఈపక్క అదే ఏపీలో తప్పుడు కేసులతో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఏపీ పోలీసులకు ఏమైంది..? ఈ తప్పుడు కేసులేంటి? వారికేమైంది..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కోర్టులో న్యాయమూర్తి ప్రశ్నించాక గానీ వారు చేసిన తప్పేంటో తెలుసుకోలేకపోతున్నారు. పోలీసుల పని తీరుకు వస్తున్న అవార్డుల ఖ్యాతి క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులతో.. ‘సంచి లాభం చిల్లు పొగొట్టింది..’ అనే సామెతలా పోతోంది. ఇందుకు ఉదాహరణగా ఇటివల అనేక అంశాలు వెలుగు చూశాయి. రీసెంట్ గా విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇవ్వాలంటూ సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించారు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే.. వారిపై అత్యాచారం సెక్షన్లు నమోదు చేసి తీవ్ర విమర్శలకు గురయ్యారు.
పోలీసుల తీరులో లోపాలు.. కొన్ని
- అమరావతిలో రాజధాని ఉద్యమం చేస్తున్న 11 మంది అసైన్డ్ భూముల రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టడమే కాకుండా బేడీలు వేసి 7గురిని కోర్టులో ప్రవేశపెట్టారు. తర్వాత వీరు జైల్లో కూడా ఉన్నారు.
- టీడీపీ నాయకురాలు వంగలపూడి అనితపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి కేసు కొట్టేసింది.
- గత ఏడాది విశాఖలో డాక్టర్ సుధాకర్ ను కార్లో వెళ్తూండగా అరెస్టు చేశారు. చేతులు కట్టేసి నడి రోడ్డుపై కూర్చోబెట్టారు.
- తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో పోలిస్ స్టేషన్లోనే ఓ యువకుడికి శిరోముండనం చేశారు. ఈ కేసు రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ఏకంగా ఆ యువకుడు రాష్ట్రపతికి అర్జీ పెట్టుకున్నాడు కూడా. ఈ కేసును పరిశీలించేందుకు రాష్ట్రపతి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు.
- శ్రీకాకుళం జిల్లాలో జగన్ అనే వ్యక్తిని టెక్కలి సీఐ కాలితో తన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో న్యాయం చేయాలని స్టేషన్ కు వచ్చిన వ్యక్తి ఫిర్యుదుపై కనీసం స్పందించకుండా ఎస్ఐ బూటు కాలితో తన్నిన వీడియో అప్పట్లో సంచలనం రేపింది.
- జీవో నెంబర్ 77 రద్దు చేయాలంటూ సీఎం జగన్ ఇంటిని ముట్టడించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులపై అత్యాచారం కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది.
పోలీసులపై ఒత్తిళ్లు ఎక్కవవుతున్నాయా..?
ఇవన్నీ ఏపీలో పోలీసులు చేస్తున్న తప్పిదాలకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈ పద్ధతిపై ప్రతిపక్షాల నుంచే కాదు.. సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సీఎం ఇంటిని ముట్టడిస్తే ఐసీపీ 143, 188, 290, 353, రెడ్ విత్ 149 సెక్షన్లతోపాటు విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 51 బీ, అంటువ్యాధుల చట్టంలోని సెక్షన్లు, పోలీసు చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం అభియోగాలు మోపడంపై కోర్టు విస్తుపోవడం పోలీసుల చర్యలకు తార్కాణం. అప్పుడు గానీ వారు చేసిన తప్పేంటో తెలుసుకోలేకపోవడం ఇక్కడ కొసమెరుపు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం పోలీసుల తీరు మరీ విమర్శలకు గురవుతోంది. దీనంతటిక కారణం ప్రభుత్వం ఒత్తిడి కూడా ఒక కారణమనే వాదనలూ లేకపోలేదు. రాష్ట్రస్థాయిలో డీజీపీ, ఐజీ స్థాయిల్లో మంత్రుల ఒత్తిడి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల స్థాయి నుంచి సీఐ, ఎస్ఐలపై ఒత్తిళ్లతో పోలీసుల పని తీరు గాడి తప్పుతోందని చెప్పాలి.
ఏపీ పోలిస్ వ్యవస్థ ఎంతో పటిష్టం..
నిజానికి ఏపీ పోలీసు వ్యవస్థ ఇప్పుడు మరింత మెరుగుపడింది. ఏడాది కాలంగా ఆ శాఖకు జాతీయ స్థాయిలో వస్తున్న అవార్డులే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం కూడా పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది. వారికి వారాంతపు సెలవు ఇచ్చింది. ఒత్తిడి లేకుండా పని చేసే సౌలభ్యం కల్పించింది. మహిళా పోలిస్ స్టేషన్లు పెంచింది. దిశ పోలిస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఇన్ని సౌకర్యాలతో పోలీసు వ్యవస్థ ఏపీలో మెరుగైన స్థితిలో ఉంది. మేధస్సు నిండుగా ఉన్న అధికారులూ ఉన్నారు. అయితే.. పోలిసులపై రాజకీయపరమైన ఒత్తిడి విమర్శలకు గురయ్యే పని తీరుకు కారణం అని చెప్పాలి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నడుస్తోందా.. వైసీపీ వ్యవస్థ నడుస్తోందా అంటూ విమర్శలు గుప్పిస్తోంది టీడీపీ. గతంలో టీడీపీ హయాంలో కూడా పోలీసుల వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోందంటూ విమర్శలు వచ్చాయి. వారి హయాం నుంచే ఖాకీపై ఖద్దరు స్వారీ ఎక్కువైందనే విమర్శలు ఉన్నాయి. ఈ తీరు త్వరగా మార్చుకోకపోతే పోలీసు వ్యవస్థపై మరిన్ని విమర్శలు రావడం ఖాయమని చెప్పాలి.