టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కుల ధోరణి మరో సారి బహిర్గతం అయింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రభుత్వానికి అందరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఇటీవల చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో అయన పెద్ద మనసుతో వ్యవహరించారని అందరూ భావించారు.అయితే ఇది మరువక ముందే అయన నైజం బయట పెట్టారు. ప్రభుత్వంపై విమర్శలు చేయవద్దు అన్న ఆయనే ప్రభుత్వ పని తీరును శంకిస్తూ సి ఎం జగన్ కు లేఖ రాయడం వైసీపీ వర్గాలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
రెండు రోజుల క్రితం బాబు ఏమన్నారంటే
‘రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) నివారణకు వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. కరోనా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదు. ప్రతి ఇంటి నుంచి డిజిటల్ సోషలైజేషన్ జరగాలి, లేదంటే.. మన దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. చైనాలోని వూహాన్లో 62 రోజుల లాక్డౌన్ పాటించారు. ఇక్కడ కనీసం 49 రోజుల లాక్డౌన్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు. గుర్తు చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అయితే ఇలా పేర్కొన్న చంద్రబాబు రెండు రోజుల వ్యవధి లోనే ప్రభుత్వ తీరును శంకిస్తూ లేఖ రాయడం విడ్డురంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
నేడు ఏమన్నారంటే..
కరోనా మహమ్మారి చిన్న విషయం కాదు.203 దేశాలను అతలాకుతలం చేస్తోంది. దేశంలో, రాష్ట్రంలో పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం కన్నా పెను సంక్షోభంగా ఐరాస ప్రధాన కార్యదర్శి స్వయంగా ప్రకటించారు.ఇంత పెద్ద మహమ్మారిని తేలికగా తీసుకోవద్దు. పాజిటివ్ కేసులను దాచిపెట్టడంతో పాటు తక్కువ లెక్కలు చెబుతున్నారనే ప్రచారం ఇప్పటికే ప్రజల్లో ఉంది. ఎప్పటికప్పుడు నిజాలు వెల్లడించి ప్రజలను మరింత అప్రమత్తం చేయాలి. నిజాలు దాచిపెడితే అది పెనుప్రమాదంగా మారుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం రోజూ విడుదల చేసే హెల్త్ బులెటిన్లు పూర్తి పాదర్శకంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోత పెట్టొద్దు అని చంద్రబాబు పేర్కొన్నారు.
విపత్కర పరిస్థితి అని తెలిసి కూడానా
కరోనా ప్రభావం కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉన్న విషయం తెలిసి కూడా ఉద్యోగుల జీతభత్యాలు కోత లేకుండా చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం పై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. టీడీపీ హయాంలో తక్కువ వేతనాలు ఉన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాన్న భోజన పధకం ఏజెన్సీ వేతనాలు నెలలు తరబడి చెల్లించని విషయం గుర్తు లేదా అని ప్రశ్నిస్తున్నారు. నేటి రాష్ట్ర పరిస్థితులను ఉద్యోగ సంఘాలు సానుభూతి తో అర్ధం చేసుకొని సహకరిస్తుంటే చంద్రబాబు ఈ విధంగా మాట్లాడటం విడ్డురంగా ఉందని అంటున్నారు.
చంద్రబాబు కరోనాను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కరోనా కేసులు దాచి పెట్టాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.