అమరావతి: అధికార పార్టీ వేధింపుల కారణంగానే మానసిక క్షోభకు గురై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారనీ, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలనీ టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మానసిక క్షోభకు మనిషి ఎ విధంగా తల్లిడిల్లిపోతారో పాతికేళ్ల క్రితమే చంద్రబాబుకు తెలుసంటూ వైసిపి ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు విమర్శలు గుప్పించారు.
వేధింపులు అంటే ఎలా ఉంటాయో, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో చంద్రబాబే ప్రపంచానికి చెప్పారని అంబటి, గోపిరెడ్డిలు అన్నారు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు, తన సొంత మామ ఎన్టి రామారావు ను ముఖ్యమంత్రి పదవి నుండి కిందికి లాగినప్పుడు ఆయన పడిన వేదన గురించి చంద్రబాబు ఏ రోజైనా ఆలోచించారా అని అంబటి ప్రశ్నించారు.
ఆయన పార్టీని, పార్టీ అధ్యక్ష పదవిని, పార్టీ జెండాని, పార్టీ ఎన్నికల గుర్తుని, పార్టీ ట్రస్టును, ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యేలను, ఎంపిలను ఎన్నికలు అయిన ఏడాదికే లాక్కుని ఆయన మరణానికి చంద్రబాబు కారకులయ్యారని సాక్షాత్తూ ఎన్టి
ఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఇవ్వాళ్టికీ సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని అంబటి, గోపిరెడ్డిలు పేర్కొన్నారు. సాక్షాత్తూ ఎన్టిఆర్ కూడా చంద్రబాబు గురించి ఇదే విషయాన్ని చెప్పారని వారు గుర్తి చేశారు. చంద్రబాబు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడ్డం లేదని అంబటి, గోపిరెడ్డిలు ప్రశ్నించారు.