అమరావతి: ఈ నెల 23వ తేదీతో చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిగా మారబోతున్నారనీ, ఆయనకు ఉపాధి కల్పించే స్థితిలోనూ ఎవరూ లేరంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా బుధవారం విజయసాయిరెడ్డి చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
‘23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్లు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాధి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు‘ అంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ను నిలిపివేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదనీ విజయసాయి రెడ్డి విమర్శించారు. వివి ప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అనుకూల వ్యక్తులతో ఎపి హైకోర్టులో, సుప్రీం కోర్టులో మరో సారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురి అయ్యాయని విజయసాయరెడ్డి అన్నారు.
ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారనీ, చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు.
‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్ లాంటి పరికరాలే వివి ప్యాట్లు. ఇవిఎంలలో నమోదైన ఓట్ల అధారంగానే లెక్కింపు ఉంటుంది. వివి ప్యాట్లను ముందుగా లెక్కించాలనే వాదన చూస్తే గుర్రం బలంగా ఉందో లేదో చూడటానికి దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండ్లాగా కనిపిస్తోంది’ అని విజయసాయి రెడ్డి అన్నారు.