అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శించారు. బందిపోట్లు, దావూద్ గ్యాంగ్లే వీళ్లకంటే నయం అని కూడా విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు, కానీ కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారినీ, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదని విజయసాయిరెడ్డి అన్నారు. 15లక్షల రూపాయలు తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట అని విజయసాయిరెడ్డి అన్నారు. ముంబాయి దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
కాగా వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులను కూడా వైసిపికి అంటగట్టడం టిడిపి దివాళాకోరుతనానికి నిదర్శనమని విజయసాయిరెడ్డి విమర్శించారు. హింస, ఉన్మాద రాజకీయాలకు టిడిపి పెట్టింది పేరని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. వైసిపికి చెందిన 400మంది కార్యకర్తలను టిడిపి పొట్టనపెట్టుకుందనీ, దీనిపై నాడు జగన్మోహనరెడ్డి గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.