న్యూఢిల్లీ: రెండవ సారి పార్లమెంట్ సభ్యుడుగా ప్రధాని నరేంద్ర మోది ప్రమాణ స్వీకారం చేశారు. 17వ లోక్సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఎంపిల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ప్రధాని మోదీ, తరువాత వరుసగా క్యాబినెట్ మంత్రులు, ఇతర ఎంపిలచే ప్రమాణ స్వీకారాన్ని కొనసాగిస్తున్నారు. ముందుగా రాష్ట్రపతి భవన్లో ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర కుమార్చే రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోది, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు హజరయ్యారు.
నేడు, రేపు ఎంపిలచే ప్రమాణ స్వీకారం, జూన్ 19న స్పీకర్ ఎన్నిక జరగనుంది.
17వ లోక్సభ స్పీకర్గా మేనకా గాంధీ, రాధామోహన్ సింగ్, ఆహ్లూవాలియా, జువార్ ఓరమ్ పేర్లు వినిపిస్తున్నాయి.
కాగా లోక్సభ సమావేశాలకు ముందు ప్రధాని మోది పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని మోది అన్నారు. ప్రతిపక్షాలు తమ సంఖ్యాబలం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్షాల ప్రతి మాట విలువైనదేనని మోది అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా పని చేయాలని మోది కోరారు. సభలో అర్థవంతమైన చర్చలు జరుగుతాయని మోది ఆశాభావం వ్యక్తం చేశారు.