ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ.. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్ధ. పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి.. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవస్థకు నిన్నటితో ఏడాది కాలం పూర్తైంది. అందుకే అందరూ చప్పట్లు కొట్టారు. సీఎం, మంత్రులు, అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. మొదటి నుంచీ ఈ వ్యవస్థను వ్యతిరేకిస్తున్న అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ఏడాది పూర్తైన రోజునే విమర్శలు చేయడం సంచలనంగా మారింది.
ఉన్నదున్నట్టు మాట్లాడేవారు కొందరు ఉంటారు..
సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ ఎంత ఉన్నతమైనదైనా దీనిని పూర్తిస్థాయిలో సంస్కరించలేదని కొందరు ఎమ్మెల్యేల వాదన. అయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ కు భజన చేస్తూ లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు కొందరు. మరికొందరు ఎమ్మెల్యేలు దీనిని ధైర్యంగా బయటకు వెల్లడిస్తారు. నిన్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నె రాంబాబు ఇదే చేశారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థల్లో సమస్యలు అలానే ఉన్నాయని.. ప్రజలకు అందాల్సినవి అందటం లేదని.. వ్యవస్థల్లో ఇదే లోపమని సూటిగా, స్పష్టంగా వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా అసంతృప్తినే కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డి కూడా గతంలో వ్యక్తం చేశారు. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రభుత్వం అంటోంది. కానీ.. స్వపక్షంలోనే కొందరు చేస్తున్న ఈ తరహా విమర్శలపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.