చిత్రం: ఎవరు
అడివి శేష్.. ఓ టీమ్ను ఏర్పాటు చేసుకుని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను చేస్తూ వరుస విజయాలను అందుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. `క్షణం`, `గూఢచారి` సినిమాలు ఈకోవలోనే ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ఇప్పుడు తనదైన పంథాలో శేష్ రూపొందించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ `ఎవరు`. పివిపి సినిమా, అడివిశేష్ కాంబినేషన్లో `క్షణం` తర్వాత రూపొందిన చిత్రమిది. మరి `ఎవరు` ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం…
బ్యానర్: పివిపి సినిమా
నటీనటులు: అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ, పవిత్రా లోకేశ్ తదితరులు
ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్
డైలాగ్స్: అబ్బూరి రవి
ఆర్ట్: అవినాష్ కొల్ల
కెమెరా: వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
దర్శకత్వం: వెంకట్ రామ్జీ
కథ:
హైదరాబాద్కి చెందిన పోలీస్ ఆఫీసర్ అశోక్(నవీన్చంద్ర)ని ఫేమస్ బిజినెస్ మేన్ రాహుల్ సతీమణి సమీర(రెజీనా కసండ్ర) కున్నూర్లో హత్య చేస్తుంది. తనను రేప్ చేసినందుకే తాను అశోక్ను చంపేశానని చెబుతుంది. చనిపోయింది పోలీస్ ఆఫీసర్ కావడంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుంటారు. విక్రమ్ వాసుదేవ్(అడివి శేష్)ని కేసుకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తారు. రోహిత్ అనే ఫేమస్ లాయర్ సమీరకు వ్యతిరేకంగా వాదించడానికి సిద్ధమవుతాడు. తప్పు తనది కాకపోయినా తన పరువు పోతుందనే భయంతో కేసును నీరుగార్చాలని సమీర భావిస్తుంది. అందుకోసం కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న విక్రమ్ వాసుదేవ్కి లంచం ఇస్తామని ఆశ పెడతారు సమీర అండ్ కో. అసలు కేసులో ఎలాంటి ఆధారాలు దొరికాయో చెబితే దాన్ని బట్టి కేసుని వీక్ చేయవచ్చునని సమీర బృందం భావిస్తుంది. డీల్ ప్రకారం సమీరను కలవడానికి ఆమె ఉండే హోటల్ గదికి వచ్చిన విక్రమ్ వాసుదేవ్ కేసులో ఆమెను బయటపడేయడానికి కేసు డీటెయిల్స్ను డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతలో అతనికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. దాంతో వారు అసలు విషయం నుండి డైవర్ట్ అవుతారు. విక్రమ్ తాను డీల్ చేసి, పై అధికారుల ఒత్తిడి కారణంగా వదిలేసిన వినయ్ వర్మ అనే వ్యక్తి మిస్సింగ్ కేసు గురించి సమీరకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అసలు వినయ్ వర్మ ఎవరు? అతనెందుకు కనపడకుండా పోతాడు? సమీర హత్య కేసుకి, వినయ్ వర్మకు ఉన్న లింకేంటి? విక్రమ్ వాసుదేవ్ కేసుని ఎలా డీల్ చేశాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల విషయానికి వస్తే.. సినిమా చూసే ప్రేక్షకుడికి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండాలి. విసుగుని తెప్పించకూడదు. ఎంగేజింగ్గా ఉండాలి. సన్నివేశాలు సాగదీతగా ఉండకూడదు. అసలేం చెప్పాలనుకుంటున్నామనే విషయాన్ని కన్ఫ్యూజన్ లేకుండా లింకులు మిస్ కాకుండా అర్థవంతంగా తెరపై ఆవిష్కరించాలి. అప్పుడే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయి. `ఎవరు` సినిమా విషయంలో యూనిట్ను అభినందించాల్సిందే. ఎందుకంటే పైన చెప్పిన విషయాలను మిస్ కాకుండా చూసుకున్నారు. రెండు క్రైమ్ విషయాలను ఒకదానికొకటి లింకు పెడుతూ దర్శకుడు వెంకట్ రామ్జీ రాసుకున్న కథ, కథనం సింప్లీ సూపర్బ్. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ట్విస్టులు, టర్న్లతో ఎంగేజింగ్గా సాగింది. ప్రతి సన్నివేశం ఎక్కడా సాగదీతగా అనిపించదు. ఇలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ను ఆకట్టుకునేలా చెప్పాలంటే.. సన్నివేశాకు క్రిస్ప్ ఎడిటింగ్ ఉండాలి. గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లు కనపడింది. అలాగే శ్రీచరణ్ సంగీతం సినిమాలోని సన్నివేశాలను ఎన్హెన్స్ చేసింది. వంశీ పచ్చిపులుసు తన కెమెరా పనితనంతో విజువల్స్ను రిచ్గా చూపించారు. అబ్బూరి రవి సంభాషణలు సందర్భానుచితంగా చక్కగా ఉన్నాయి. ఇక నటీనటుల పరంగా చూస్తే అడివిశేష్ని నటుడిగా మరో మెట్టు ఎక్కించే సినిమా ఇది. సినిమా ప్రారంభంలో అతని క్యారెక్టర్ని ప్రెజెంట్ చేసిన తీరుకి, సినిమా ముగింపులో అతని క్యారెక్టర్ను చూపించిన తీరు ఎంతో హైలైట్గా ఉంది. నవీన్చంద్రకి చాలా కాలం తర్వాత మంచి రోల్ పడింది. తనకు ఈ సినిమా మంచి గుర్తింపును తెస్తుందనడంలో సందేహం లేదు. ఇక రెజీనా క్యారెక్టర్ మరో రేంజ్లో ఉంటుంది. ఆమె క్యారెక్టర్లో ఉన్న షేడ్స్.. వాటిని ఆమె పండించిన తీరు సింప్లీ సూపర్బ్. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా.. `ఎవరు`.. ఆకట్టుకునే ఎంగేజింగ్ థ్రిల్లర్
రేటింగ్: 3.5/5