(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
పెహ్లూఖాన్ మూకహత్య కేసులో నిందితులైన ఆరుగురినీ రాజస్తాన్ కోర్టు ఒకటి నిర్దోషులుగా విడుదల చేసింది. సంశయలాభం (benefit of doubt) సూత్రాన్ని నిందితులకు వర్తింపజేసినట్లు అల్వార్ కోర్టు తెలిపింది.
2017 ఏప్రిల్లో పశువులను ఒక వాహనంలో తీసుకువెళుతున్న పెహ్లూఖాన్ను ఢిల్లీ-జైపూర్ హైవేలో గోరక్షక దళం మూక ఆటకాయించి అతనిని విచక్షణారహితంగా కొట్టారు. మూడు రోజుల తర్వాత పెహ్లూఖాన్ ఆసుపత్రిలో మృతి చెందాడు. పెహ్లూఖాన్ను మూక కొడుతుండగా వీడియో తీసారు. ఆ వీడియో దేశమంతా తిరిగింది.
వీడియో ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి తొమ్మిది మందిపై కేసు పెట్టారు. వారిలో ముగ్గురు మైనర్ బాలురు. ఆ ముగ్గురూ బెయిల్పై బయట ఉన్నారు.
జైపూర్లో జరిగే ఒక సంతలో పెహ్లూఖాన్ పశువులను కొనుగోలు చేసి హర్యానా వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. పెహ్లూఖాన్తో పాటు ఉన్న మరో అయిదుగురిపై కూడా దాడి చేశారు.