తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కు విరామం ప్రకటించి హూటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లారు. నాలుగు రోజుల క్రితం బండి సంజయ్ యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామం నుండి పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 21వ రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది. అయితే ఈ రోజు (శనివారం) ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడుగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉన్నందున ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లను బండి సంజయ్ కలిసే అవకాశం ఉంది.
ఈ నెల 21వ తేదీ మునుగోడులో బహిరంగ సభ, పాదయాత్ర ముగింపు సభలకు వీరిద్దరిని బండి సంజయ్ ఆహ్వానించనున్నట్లు తెలుస్తొంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మునుగోడుకు ఉప ఎన్నిక జరగనుండగా, తాజా రాజకీయ పరిణామాలను బిజేపీ అగ్రనేతలకు బండి సంజయ్ వివరించనున్నారు. రాజగోపాల్ రెడ్డి ఈ నెల 8వ తేదీన అసెంబ్లీ స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. 21వ తేదీ మునుగోడులో జరిగే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరనున్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపి రాజగోపాల్ రెడ్డికి బుద్ది చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సభకు ధీటుగా రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగా ఈ నెల 21న భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలన్న ప్లాన్ లో బీజేపీ ఉంది.