Bandi Sanjay: ఏపి, తెలంగాణ జల వివాదం విషయంపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వివాదంలో కేసిఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసిఆర్ తిరుమల పర్యటనకు వెళ్లిన సందర్భంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ సమయంలో కేసిఆర్, ఏపి సీఎం జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
నీటి ఒప్పందాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రుల అంగీకర పత్రాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు బండి సంజయ్. నాడు తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు, ఆంధ్రకు 512 టీఎంసీల నీళ్లు అని కేటాయింపులు చేసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కృష్ణాజలాల సమస్యపై కేంద్ర జలశక్తి మంత్రికి మొన్న లేఖ రాయడంతో పాటు చర్చించామని బండి సంజయ్ చెప్పారు. అయితే తాము మీడియాకు చెప్పలేదనీ, ఆయన (కేసిఆర్) బాగా లీకులు ఇస్తారన్నారు.
కేంద్ర మంత్రికి కేసిఆర్ ఫోన్ చేసి ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదనీ, ఆ తరువాత మిస్డ్ కాల్ చూసిన కేంద్ర మంత్రి కాల్ బ్యాక్ చేశారన్నారు. అయితే దీనికి కేంద్ర మంత్రే తనకు ఫోన్ చేశారంటూ కేసిఆర్ ప్రచారం చేసుకున్నారన్నారు. నోరు తెరిస్తే అబ్దద్దాలేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసిఆర్ అన్యాయం చేశారనీ, దక్షిణ తెలంగాణను ఎడారిగా చేశారని దుయ్యబట్టారు.
తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలైతే శ్రీశైలం ప్రాజెక్టులో దూకి చచ్చిపోయేందుకైనా సిద్ధమని బండి స్పష్టం చేశారు. తాను చెప్పింది నిజమైతే సీఎం కేసిఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకేసి రాసి పొర్లుదండాలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి సీఎం కేసిఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.