Telangana Election 2023: బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలి పదవికి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమా రాజీనామా చేశారు. వేములవాడ బీజేపీ అభ్యర్ధిత్వాన్ని తొలుత ఆమెకు ఖరారు చేసిన పార్టీ అధిష్టానం.. చివరి నిమిషంలో బీఫామ్ ను మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో తీవ్ర కలత చెందిన తుల ఉమ బీజేపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు ఓ పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్ ప్రయత్నించాయి. కాంగ్రెస్ అభ్యర్ధి ఆది శ్రీనివాస్ ఆమె నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆమె ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే తన అనుచరులు, అభిమానులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఉమా తెలిపారు. ఆమె సన్నిహితులతో సమావేశం నిర్వహించగా, మెజార్టీ శ్రేణులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తొంది.
ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపారు తుల ఉమ. లేఖలో బీజేపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ మహిళను బీజేపీ అవమానించిందని పేర్కొన్నారు. తన జాతి గొల్ల కురుమలను అవమానించిన బీజేపీ ..బీసీ నినాదం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజానీకంతో తనకు పెన వేసుకున్న బంధాన్ని మీ టికెట్లు తెంపలేవని అన్నారు. నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో పని చేసిన తుల ఉమ మరల సొంత గూటికి చేరనున్నారు.