Corona Effect : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుండి (మార్చి 24వ తేదీ( నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ వేదికగా వేదికగా ప్రకటించారు. ఆన్ లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు.
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తోందని, పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనబడుతోందని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. విద్యాసంస్థల్లో భోధన, భోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతున్నందున కరోనా తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు మూసివేశాయన్నారు. తెలంగాణలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయన్నారు.
ఈ పరిస్థితులను సమీక్షించిన తరువాత విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు కరోనా వ్యాప్తిని అరకట్టేందుకు గానూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలు అన్నింటినీ రేపటి నుండి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈ మూసివేత ఆదేశాలు వైద్య కళాశాలలు మినహాయించి రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ వర్తిస్తాయని తెలిపారు.