Breaking: తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. అదనపు డీజీ లు సందీప్ కుమార్ జైన్, మహేష్ భగవత్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో డీజీపీ అంజనీకుమార్, అదనపు డీజీలు ఈ వేళ మధ్యాహ్నం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిసి బొకెలు అందజేసి అభినందనలు తెలిపారు. ట్రెండ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటం, కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి. దీనిపై ఈసీ సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డిని డీజీపీ కలవడంతో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది.