Hyderabad Drugs Case: బంజారాహిల్స్ లో తాజాగా నమోదు అయిన డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేయడం, ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నేతల పిల్లలను పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. పబ్ లో డ్రగ్స్ పోలీసు యంత్రాంగం సీరియస్ గా పరిగణించి దర్యాప్తు చేస్తోంది. పోలీసుల దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన, కీలక విషయాలు వెలుగు చూశాయి. పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుండి కీలక సమాచారాన్ని రాబట్టారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు.
Hyderabad Drugs Case: ఈ పబ్ లోకి ప్రవేశించాలంటే..?
ఈ పబ్ లో మద్యంతో పాటు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో మూడవ తేదీ తెల్లవారుజామున ఆకస్మికంగా దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పబ్ లోకి ప్రవేశించాలంటే పామ్ అనే యాప్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఆ యాప్ లో లాగిన్ అవ్వాలంటే ముందుగా రూ.50వేలు చెల్లించాల్సి ఉంటుందని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. దాడి చేసిన సమయంలో కౌంటర్ వద్ద ఉన్న ట్రేలలో స్ట్రాలు, టిష్యూ పేపర్లు, టూత్ పిక్స్ తో పాటు అనుమానాస్పద ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షించగా కొకైన్ (డ్రగ్స్) అని తేలింది. 4.6 గ్రాముల కొకైన్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.
నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే..
అక్కడి ల్యాప్ టాప్, ప్రింటర్, వేయింగ్ మిషన్తో పాటు ప్యాకింగ్ మెటీరియల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి విచారణ జరపారు. పబ్ మేనేజర్ అనిల్, నిర్వాహకుడు అభిషేక్లను విచారించగా పబ్లో కిరణ్రాజు, అర్జున్ వీరమాచినేని కూడా భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి వారిపైనా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. పబ్ లో విక్రయిస్తున్న డ్రగ్స్ ఎలా వస్తున్నాయి..? ఎవరు సప్లై చేస్తున్నారు..? అనే పూర్తి వివరాలను తెలుసుకునేందుకు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.