Etela rajendar: భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఇ ఈటెల రాజేందర్ పై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణ నిర్వహించి సమగ్ర నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మెదక్ జిల్లా అచ్చంపేటలో ఏసీబీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మంత్రి ఈటెల పై ఫిర్యాదు చేసిన రైతుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. విజిలెన్స్ ఎస్పి మనోహర్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. తూప్రాన్ ఆర్డిఓ రామ్ ప్రకాష్ అధికారులతో భూములను సర్వే చేస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ సర్వేలో నేపద్యంలో ఈటెల కు చెందిన ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులను భారీగా మోహరించారు.
మరోపక్క మంత్రి ఈటల పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మాట మాత్రంగా ఆయన చెప్పకుండా విచారణకు ఆదేశించడం విచారకరమని అన్నారు. తనపై కొందరు కుట్రతో ఇదంతా చేస్తున్నారనీ, త్వరలో అన్ని వెల్లడి అవుతాయని ఈటెల అన్నారు. మూడు రోజులుగా కేటిఆర్ తో మాట్లాడేందుకు ప్రయత్నించాననీ, కావాలనే అవాయిడ్ చేసినట్లుగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదనీ, పీఎ కూడా మాట్లాడిస్తానని చెప్పి కూడా మాట్లాడించలేదన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఈటెల సమర్థించుకున్నారు. పార్టీ బలోపేతంలో తన పాత్రను ఈటెల తెలియజేశారు. కాగా ఈ పరిణామాల క్రమంలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటెల నివాసానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు.