BJP Janasena Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా జనసేన పోటీ చేస్తొంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా బీజేపీ పొత్తుతో జనసేన ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎనిమిది స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిపోటీ చేస్తామని ఈ రెండు పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించగా, శనివారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు.
పొత్తులో భాగంగా జనసేనకు ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్, కూకట్ పల్లి, తాండూరు, కోదాడ సీట్లు కేటాయించినట్లుగా తెలుస్తొంది. మల్కాజ్ గిరి, నాంపల్లి స్థానాలను సైతం జనసేన కోరుతోంది. ఈ రెండు స్థానాల విషయం తేలాల్సి ఉంది. ఈ రెండు స్థానాల విషయంలో మరో సారి సమావేశమై చర్చించాలని భావిస్తున్నారు.కాగా ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హజరవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను హజరు కావాలని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఆహ్వానించారు. ఇందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకటి రెండు సీట్లు తప్ప మిగిలిన వాటిపై ఒప్పందానికి వచ్చామని చెప్పారు. నరేంద్ర మోడీ యే మూడో సారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఎన్డీఏ భేటీలో కూడా ప్రధాని మోడీ ఉండాల్సిన ఆవశ్యకతపై చర్చించామన్నారు. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. ఈ నెల 7న హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బీసీ బహిరంగ సభలో తాను పాల్గొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని తొలుత భావించామనీ, అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చర్చలు జరిపామని తెలిపారు.
బీజేపీ నేతలతో చర్చల అనంతరం పొత్తులో భాగంగా కేటాయించిన స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది. అదివారం (ఈ రోజు) సాయంత్రానికి అధికారికంగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు.. కూకట్ పల్లి నుండి నేమూరి వీరేశం గౌడ్, కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి, తాండూరు నుండి కిశోర్ కుమార్ రెడ్డి, వైరా నుండి సంపత్ నాయక్, నాగర్ కర్నూల్ నుండి లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం నుండి మిరియాల రామకృష్ణ, అశ్వారావుపేట నుండి మహేంద్ర నాయక్, కొత్తగూడెం నుండి వేముల కార్తీక్ లను అభ్యర్ధులుగా జనసేన ఖరారు చేసినట్లుగా తెలుస్తొంది. మల్కాజ్ గిరి, నాంపల్లి స్థానాల అభ్యర్ధులపై కసరత్తు జరుగుతోంది.
Telangana Election: కామారెడ్డి బరి నుండీ రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ పార్టీ హింట్ ఇచ్చినట్లే(గా)..!