Malla reddy Vs Revanth Reddy: మంత్రి భూకబ్జా బాగోతం అంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏవో జిరాక్సు కాపీలు తీసుకువచ్చి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు మల్లారెడ్డి. ఏదైనా చెబితే నమ్మెట్లు ఉండాలన్న మల్లారెడ్డి..ఊరికే బుదర చల్లితే సరిపోద్దా అని నిలదీశారు. ఓ పెద్ద మనిషిపై బట్ట కాల్చి మీదపడేస్తే వాడి చావు వాడు చస్తాడు అన్నట్లుగా రేవంత్ చర్యలు ఉన్నాయన్నారు.
టీడీపీలో ఎంపి అయిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ఇబ్బందులు పెడుతున్నాడనీ, తాను ఆశించిన మల్కాజిగిరి ఎంపీ సీటు నేను తీసుకున్నాననే కోపంతో రేవంత్ రెడ్డి నా కాలేజీలు మూయిస్తానంటూ బెదిరించారనీ, నేను ఆనాడు చంద్రబాబుకు ఈ విషయంపై ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. ఈ దేశంలో మొదటి మహిళా మెడికల్ కళాశాల పెట్టింది నేనేనన్నారు. దొంగ కాగితాలు చూపి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి కాలేజీలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అని మల్లారెడ్డి ప్రశ్నించారు.
జవహర్ నగర్ లో మొత్తం ప్రభుత్వ భూమే ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల ప్రజలు అక్కడి భూముల్లో ఇళ్లు కట్టుకున్నారు. కనీస వసతులు లేని జవహర్ నగర్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి 330 ఎకరాలలో పేద ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. జవహర్ నగర్ లో తన కోడలు పేరు మీద 448 సర్వే నెంబర్ లో 350 గజాల భూమి మాత్రమే ఉందని, దానికి సంబంధించి రిజిస్టర్ దస్తావీజులు, ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు మల్లారెడ్డి చూపారు. జవహర్ నగర్ లో పేద ప్రజల కోసం ఆసుపత్రి నిర్మించి వైద్య సేవలు అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. మెడికల్ కాలేజీ కోసం రోగులు అవసరమనీ, స్థానికంగా ఉండే ప్రజలకు మా మెడికల్ కాలేజీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
మల్లారెడ్డి విద్యాసంస్థలపై రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే హెచ్ఆర్డీ మినిస్టర్ ఏమి అవకతవకలు లేవంటూ సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ అందుకు సంబంధించిన పత్రాన్ని మీడియా సమావేశంలో చూపారు మంత్రి మల్లారెడ్డి. గుండ్లపోచంపల్లి 21 ఎకరాలలో నా యూనివర్శిటీ ఉందనీ, రేవంత్ రెడ్డి చెప్పినట్లు 650 సర్వే నెంబర్ లో యూనివర్శిటీ లేదని స్పష్టం చేశారు. నేను పాలు, పూలు అమ్మి అభివృద్ధి చెందా, మరి రేవంత్ రెడ్డి ఏం చేసి సంపాదించాడని ప్రశ్నించారు మల్లారెడ్డి, నేను తలుచుకుంటే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పై నా కామెంట్స్ చూసి కాంగ్రెస్ వాళ్లే నాకు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి సిగ్గు ఉంటే హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. తాను ఏడాదికి రెండు కోట్ల 30లక్షలు పన్ను కడుతున్నానని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.
రేవంత్ రెడ్డి ఒక్కో మీటింగ్ కు రావాలంటే రూ.50 లక్షలు డిపాజిట్ చేయాలనీ, ఇంద్రవెళ్ళి సభకు ప్రేమ్ సాగర్ ను, ర్యావిరాల సభకు మల్రెడ్డి బ్రదర్స్, మూడు చింతపల్లి సభకు వజ్రేష్ యాదవ్, హరివర్థన్ లను బలిచేశాడని ఆరోపించిన మంత్రి మల్లారెడ్డి..మరో సభకు బకరా కోసం నేతను వెతుకున్నారని విమర్శించారు. దివాలా తీసిన పార్టీకి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని అన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు కేసిఆర్ ను తిడితే ప్రజలే బుద్ది చెబుతారని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు.