Telangana Minister KTR: గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేసిఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు వారు మాట్లాడిన భాషలోనే మల్లారెడ్డి ఆవేశంలో సమాధానం చెప్పారన్నారు. ప్రజా మద్దతుతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసిఆర్ ను ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్లు నేడు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటిఆర్. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒకడు బట్టేబాల్ అంటాడు, దానికి మేము ఏమి అనాలి అని ప్రశ్నించారు. మా మల్లారెడ్డికి జోష్ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అందుకే ఓ మాట అన్నాడని సమర్ధించారు. సహనానికి హద్దులు ఉంటాయన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు సంస్కారవంతంగా మాట్లాడాలని తాము కోరుకుంటామని అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్కపార్టీ లో నుండి దిగుమతి చేసుకుని చంద్రబాబు నాయుడు తొత్తు, బినామీని తీసుకుని వారి పార్టీకి అధ్యక్షుడుగా పెట్టుకున్నారని కేటిఆర్ విమర్శించారు. చివరకు ఓ కేసులో అడ్డంగా డబ్బుల సంచులతో వెళ్లి అడ్డంగా దొరికిపోయిన ఆయనను అధ్యక్షుడుగా చేసుకున్నారని అన్నారు. ఆయన ఈ రోజు సీఎం మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడనీ దానికి మేము ఏమనాలి అని ప్రశ్నించారు.
Telangana Minister KTR: ఏడేళ్లుగా ఓపికతో ఉన్నారు ఇక మా వాళ్లు ఇక ఆగేట్టు లేరు
ఏడేళ్లుగా ఓపిక పడుతున్నామన్నారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ తెలంగాణకు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది, పుట్టించింది సీఎం కేసిఆర్, ఏవరైనా కాదంటారా అని ప్రశ్నించారు. అలాంటి నాయకుడిని పట్టుకుని ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడితే ఎన్ని రోజులు భరాయించాలన్నారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఓ మాట అంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా లోపలేశారని గుర్తు చేస్తూ ఇక్కడ తాము కూడా అదే చేయమంటే చేస్తామన్నారు. ఇక్కడ అలా చేస్తే మీరు సమర్ధిస్తారా ? మీరే గగ్గోలు పెడతారు. ప్రజాస్వామ్యం, ఇంకేదో ఇంకేదో అంటూ లొల్లి పెడతారని అన్నారు కేటిఆర్. మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వమే ఉందని పేర్కొన్నారు. “ఒకడు చంపేస్తామంటాడు, ఒకడు తొక్కేస్తామంటాడు, మరోకడు ఏంకేదో అంటాడు. కొంత మంది జర్నలిస్ట్ ముసుగులో మాట్లాడతారు. రాజకీయ నాయకులుగా కాకుండా అన్ పార్లమెంటరీ భాష మాట్లాడతారు. వాక్ స్వాతంత్రానికి ఓ హద్దు ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడుతాం, ఏది పడితే అది చేస్తాం, జర్నలిస్ట్ ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తాం అంటే ఊరుకుంటారా. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుంది. అక్కడక్కడా మావాళ్లు నోరు తూలుతే మేము ఏమనాలి. ఓపిక ఓపిక అంటూ ఏడేళ్లు ఆపినామ్, వాళ్లు ఆపినా ఇక ఆగేటట్లు లేరు” అని కేటిఆర్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ఏమి ఉద్దరించిందని బండి సంజయ్ యాత్ర
ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర చేయడాన్ని తప్పుబట్టారు. బండి మీద పోదామంటే పెట్రోల్ భారం ఎక్కువైందని ఆయన పాదయాత్ర చేస్తుండట అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ఏమి చేసిందని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడుని ప్రశ్నించారు. “బీజేపీ పాలిత ప్రాంతాల్లో వరదలు వస్తే రూ.500 కోట్లు, వెయ్యి కోట్లు ఇచ్చాం, హైదరాబాద్ కు వరదలు వస్తే మొండి చేయి చూపించాము, ఒక్క నయాపైసా ఇవ్వలేదు అయినా మాకు సిగ్గులేకుండా పాదయాత్ర చేస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి” అని యాత్ర చేస్తున్నారా సమాధానం చెప్పాలన్నారు. మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా, సిట్ ఇండియా, స్కిల్ ఇండియా అయపోయి.. బేచో ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని కేటిఆర్ ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించడం చేతగాక 6లక్షల ఎకరాల భూములను అమ్మేస్తున్నారని అందులో మౌలాలిలోని 21 ఎకరాల రైల్వే భూములు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ఆస్తులను ఇష్టమొచ్చినట్లు అమ్మేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.