Love Marriage: తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన యువతీ యువకులు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పాటు యువకుడి కంటే యువతి వయసు ఒక సంవత్సరం పెద్దది కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో వీరు పెద్దలను ఎదిరించి స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 40 రోజుల క్రితం వివాహం చేసుకునేందుకు కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నారు. శుక్రవారం యువకుడి స్నేహితుల సమక్షంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు.
Read More: AP High Court: బ్రేకింగ్.. ఏపి హైకోర్టులో ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ..! అది ఏమిటంటే..?
ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు హుటాహుటిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కుమార్తెను తమతో రావాలంటూ బ్రతిమిలాడారు. ఓ పక్క యువకుడి స్నేహితులు, మరో పక్క యువతి తల్లిదండ్రులు, బంధువులు అక్కడ ఉండటంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన యువకుడు కారులో అక్కడ నుండి ఎస్కేప్ అయ్యేందుకు యువతిని కార్యాలయం నుండి బయటకు తీసుకుని రావడంతో యువతి పేరెంట్స్ వారిని చుట్టుముట్టి తమతో రావాలంటూ యువతిని ప్రాధేయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి స్నేహితులు ఆమె తల్లిదండ్రులను పక్కకు తోయడంతో యువతీ యువకులు సినీ పక్కీలో కారు ఎక్కేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. వెంటనే తేరుకున్న యువతి తల్లిదండ్రులు కారును వెంబడించినా ప్రయోజం కలగలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు యుక్త వయసు రాగానే ఇలా ప్రేమించిన యువకుడితో వెళ్లిపోవడం తో ఆ యువతి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీవ్ర బావోద్వేగా నికి గురయ్యారు. అక్కడి పరిస్థితి చూపరుల హృదయాలను కలచి వేసింది.