Telangana Election: తెలంగాణ ఎన్నికల వేళ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తు లేదని పేర్కొన్న అసదుద్దీన్.. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తొంది కాబట్టే సమర్ధిస్తున్నామన్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం ఉందని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏబీవీపీలో పని చేశారనీ, గతంలో కార్వాన్ లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా గడిమల్కాపూర్ లో ప్రచారం కూడా నిర్వహించారని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆయనను టీడీపీకి పంపిస్తే ఆ పార్టీ అడ్రస్ తెలంగాణలో గల్లంతు అయ్యిందన్నారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనతో రేవంత్ కాంగ్రెస్ లో చేరారన్నారు. మోహన్ భగవత్ రిమోట్ కంట్రోల్ తోనే గాంధీ భవన్ పని చేస్తొందన్నారు.
కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని బీజేపీ అగ్రనేతలు విమర్శిస్తున్న తరుణంలో మోహన్ భగవత్ రిమోట్ కంట్రోల్ తోనే గాంధీ భవన్ పని చేస్తొందని అసదుద్దీన్ విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని అన్న అసదుద్దీన్ .. హైదరాబాద్ లో మజ్లిస్ బలంగా ఉంది కాబట్టే తెలంగాణలో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. కానీ కర్ణాటక, రాజస్థాన్, మద్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లలో ఎందుకు ప్రకటించలేదో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. అక్కడ ముస్లిం లు లేరా లేక వారి అభివృద్ధి పై చిత్తశుద్ది లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకడం లేదని పసిగట్టి హంగ్ అసెంబ్లీ కోసం ప్రయత్నిస్తొందన్నారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చూస్తొందని, దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్దిపొందాలని బీజేపీ భావిస్తొందని అన్నారు.
ప్రజలు మజ్లిస్ 9, బీఆర్ఎస్ 110 సీట్లలో సంపూర్ణ మద్దతు ఇచ్చి కేసిఆర్ మామకు అధికారం కట్టబెట్టాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ అసమర్ధత వల్లనే బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఎంపీల బలం 50కి పడిపోయిందన్నారు. మోడీ ప్రధాని కావడానికి ఆయనే కారణమని పేర్కొన్నారు. తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి కోపం అంతా మజ్లిస్ పై ప్రదర్శిస్తున్నారని, ఓట్లు చీల్చుతున్నామని తమపై అపవాదు వేస్తున్నారన్నారు. అమెథీలో మజ్లిస్ పోటీ చేయకపోయినా స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ పరాజయం పాలైయ్యారన్నారు.
తాత, ముత్తాత, నానమ్మ సీట్లను కూడా రాహుల్ కాపాడుకోలేకపోయారన్నారు. కేరళలోని వయినాడ్ లో ముస్లిం లీగ్ సహకారంతో 30 శాతం ముస్లిం ఓట్లతో రాహుల్ గెలిచారన్నారు. మహరాష్ట్రలో శివసేనతో అధికారం పంచుకున్న కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎంఐఎం బీఆర్ఎస్ కు తలుపులు మూసేశామని రాహుల్ అంటున్నారనీ, ఇండియా కూటమిలో తాము ఎలా భాగస్వాములమవుతామని ప్రశ్నించారు.
ED: పార్టీ మారిన ఫలితం .. దెబ్బపడింది(గా)..!