TS Politics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అవ్వడంతో ప్రధాన రాజకీయ పక్షాలు లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయని వార్తలు వెలువడుతుండటంతో పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 12 స్థానాలకు దాదాపు అభ్యర్ధులను ఖరారు చేసినట్లు తెలుస్తొంది. ఇక బీజేపీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తొంది. ఈ క్రమంలో భాగంగా 28వ తేదీన పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బలం పెరగడం, మూడు స్థానాల నుండి 8 స్థానాలను ఎదగడం ఆ పార్టీకి ఊపు ఇస్తొంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవగా, ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కనీసం పది స్థానాలు అయినా సాధించాలన్న పట్టుదలతో ఉంది. సీనియర్ నేతలు లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ పార్టీ నుండి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ తీర్మానం చేసి పంపింది.
పదికి పైగా లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని తాజాగా ఏబీబీ సీఓటర్ సర్వే అంచనాలు వెలువడటంతో కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై కసరత్తు ప్రారంభించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం పరిశీలిస్తొంది. మల్కాజ్ గిరి నుండి సోనియాను పోటీ చేయించే ఆలోచనలో తెలంగాణ నేతలు ఉన్నట్లు తెలుస్తొంది. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి రేవంత్ రెడ్డి ఈ స్థానం నుండి ఎంపీగా గెలిచారు. సోనియా గాంధీని తొలుత మెదక్ నుండి పోటీ చేయించాలని పార్టీ నేతలు అనుకున్నా ఢిల్లీ నేతలు చర్చల అనంతరం మల్కాజ్ గిరి నుండి పోటీ చేయించే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి రెండో వారం తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి ఇప్పటి వరకూ మూడు సార్లు ఎన్నికలు జరగ్గా 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మల్లారెడ్డి, 2019లో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు అన్నీ బీఆర్ఎస్ గెలుపొందడంతో ఇక్కడ నుండి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి ని బరిలోకి దించే అవకాశం ఉందనే టాక్ నడుస్తొంది. సోనియా గాంధీ పోటీకి దిగితే బీఆర్ఎస్ కు ఈ స్థానం లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఓటింగ్ బాగానే ఉంది. గడచిన ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన రామచంద్రరావుకు మూడు లక్షలకుపైగా ఓట్లు వచ్చాయి. కేవలం పది వేల ఓట్ల తేడాతోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిపై విజయం సాధించారు.
గడచిన ఎన్నికల్లో రామచంద్రరావు ఓటమి పాలైనందున ఆ సారి తనకు అవకాశం లభిస్తుందేమో అన్న ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారుట. అయితే ఈ స్థానం నుండి పోటీ చేయడానికి బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు ఆసక్తి చూపుతున్నారన్న మాట కూడా వినబడుతోంది. అయితే సోనియా గాంధీ పోటీ చేయడం ఖాయమైతే మాత్రం ఇక్కడ నుండి సినీ సెలబ్రిటీలను పోటీకి నిలిపే ఆలోచన బీజేపీ చేస్తుందని అంటున్నారు. మాజీ ఎంపీ జయప్రద, లేదా మాజీ ఎమ్మెల్యే జయసుధ పేర్లను పరిశీలించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని బట్టి బీజేపీ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంటుంది.
AP Politics: ఏపీ ఎన్నికల్లో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు..ఏ పార్టీకి ప్లస్ .. ఏ పార్టీకి మైనస్..?