మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా ఇతర నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న ఆ ఇద్దరు నేతల నివాసాలకు వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. ముందుగా జూపల్లి కృష్ణారావును కలిసిన కాంగ్రెస్ నేతల బృందం పార్టీలోకి రావాలని కోరారు. ఆ తర్వాత అక్కడి నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీలో చేరిక అంశంపై చర్చించినట్లు తెలుస్తొంది. కేసిఆర్ ను గద్దె దించేందుకు కలిసి రావాలని కోరినట్లుగా తెలుస్తొంది.
ఇక వీరు పార్టీ చేరిక విషయానికి వస్తే.. వీరు ఇద్దరు జూలై 2న ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఈ సభకు రాహుల్ గాంధీ హజరుకానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ముందుగానే ఈ నెల 25న వీరు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమై చర్చించనున్నారు. 26వ తేదీన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేరికపై ప్రకటిస్తారని తెలుస్తొంది. రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలోనూ ఖమ్మం బహిరంగ సభపై చర్చించినట్లు సమాచారం.
కర్ణాటక ఎన్నికలకు ముందు పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు మొదట చర్చలు జరిపారు. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ ను బీజేపీనే గట్టిగా ఎదుర్కోగలదనే నమ్మకంతో ఈటెల రాజేందర్ తో ఉన్న వ్యక్తిగత సంబందాలతో పలు దఫాలు చర్చలు నిర్వహించారు. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరడమే మంచిదనే అభిప్రాయాన్ని పొంగులేటి అనుచరుల నుండి వ్యక్తం కావడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం తదితర కారణాల కారణంగా జూపల్లి, పొంగులేటి కొద్ది రోజులు వేచి చూసే ధోరణిలో ఉండిపోయారు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను ఓడించాలంటే ఆ పార్టీ వ్యతిరేకులంతా కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీ ని పెట్టడమా లేక అందరూ కలిసి ఒకే పార్టీ లోకి వెళ్లడమా తదితర ప్రత్యామ్నాయాలపైనా నేతలంతా కలిసి నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు.
బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కు పార్టీలో సముచిత స్థానం లభించకపోవడం, ప్రాధాన్యత లేని చేరికల కమిటీ చైర్మన్ గా నియమించడం, శాసనసభలో బీజేపీ పక్ష నేతగా కూడా అవకాశం ఇవ్వకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత విషయంలో ఈడీ, సీబీఐ దూకుడు తగ్గించడం తదితర విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత బీజేపీలో చేరినా సరైన ప్రాధాన్యత ఉండదనీ, బీఆర్ఎస్ కు గట్టిగా చెక్ పెట్టే ఆలోచనలో బీజేపీ లేదని ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తొంది. జూపల్లి, పొంగులేటితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జడ్పీ చైర్మన్ లు కూడా ఖమ్మం సభలో కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
YSRCP: గడప గడపకు సమీక్షలో ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ క్లాస్