Revanth Reddy: తెలంగాణలో దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి విడతగా తన మంత్రివర్గంలో పదకొండు మందిని తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. మంత్రివర్గంలో 17 మందికి మాత్రమే చోటు కల్పించే అవకాశం ఉండగా, ఇప్పటికే 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఆరుగురుకి అవకాశం ఉండటంతో ఆశావహులు తమకు అవకాశం దక్కుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు లభిస్తుంది అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ముస్లిం మైనార్టీ నేతకు కచ్చితంగా విస్తరణలో అవకాశం లభిస్తుందని అంటున్నారు. తొలి విడతలో సీనియర్ నేతలకు పదవులు లభించాయి. సీనియర్ లతో పాటు ఎన్నికల ముందు పార్టీలో చేరి అభ్యర్ధుల గెలుపునకు కారణంగా భావిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి వారికి రేవంత్ మంత్రివర్గంలో చోటు లభించింది. పార్టీ అధికారంలోకి వస్తే తమకు తమకు మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న వారు అనేక మంది ఎదురుచూపులు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న వారు ఎక్కువ మంది ఉండగా, మంత్రి పదవులు మాత్రం కొన్నేఉన్నాయి. ఈ తరుణంలో అటువంటి వారికి రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవులు కట్టబెట్టే అవకాశం ఉందని అంటున్నారు.
తొలి మంత్రివర్గంలో కొన్ని ప్రాంతాల నేతలకు అవకాశం దక్కకపోవడంతో వారు తమకు అవకాశం వస్తుందన్న అంచనాలో ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వారంతా ఓటమి పాలైయ్యారు. పోటీ చేసి ఓటమి పాలైన వారికి మంత్రి పదవులు ఇవ్వకపోవచ్చు. వారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించలేని పరిస్థితి ఉంది. అయితే సీనియర్ నేత షబ్బీర్ ఆలీ విషయంలో మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తొలి మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీలకు అవకాశం దక్కలేదు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసేందుకు షబ్బీర్ ఆలీ రూరల్ కు మారారు. ఆ సమయంలోనే ఒక వేళ ఓటమి పాలైతే ..ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని షబ్బీర్ ఆలీకి హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి.
మరో పక్క గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినట్లు వార్తలు వచ్చాయి. గతంలో బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించిన ముస్లిం మైనార్టీ ఓటర్లు ఈ సారి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారని సమాచారం. ఈ కారణంగా షబ్బీర్ ఆలీకి బెర్త్ కన్మర్మ్ అని భావిస్తున్నారు. అలానే అద్దంకి దయాకర్ కు చోటు లభించే అవకాశం ఉందని అంటున్నారు. తనకు సీటు రాకపోయినా పార్టీ కోసం పని చేసినందున దయాకర్ కోసం సీఎం రేవంత్ పార్టీ అధిష్టానం వద్ద పట్టుబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో పక్క పార్టీకి ఆర్ధికంగా అండగా నిలవనున్న గడ్డం వివేక్ వెంకట స్వామికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించడం ఖాయమని అనుకుంటున్నారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గెలిచిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని వార్తలు వినబడుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కేసిఆర్ వేరే పార్టీల నుండి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన బలం పెంచుకునేందుకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడవచ్చని అంటున్నారు. ఇతర పార్టీల నుండి మరో పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి ఎటువంటి ఢోకా ఉండదని లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు పరిస్థితిగా ఉంటుందనే మాట వినబడుతోంది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ విమర్శించలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే .. గతంలో వారు చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పేమిటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మంత్రివర్గ విస్తరణ అంశంపై పార్టీ అధిష్టానంతో చర్చించేందుకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. నూతన సంవత్సరం ఆరంభం లోపే ఈ ప్రక్రియ జరగవచ్చని భావిస్తున్నారు. చూడాలి మరి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయో..బీఆర్ఎస్ నుండి ఎవరెవరు కాంగ్రెస్ గూటికి చేరుతారో..!
Janasena: జనసేనలో వార్ ..మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కీలక ప్రకటన