గోవా నుండి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ఉండగానే లోపల పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. దాదాపు 28 నిమిషాల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. చివరకు శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చివరిలో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 86 మంది ప్రయాణీకులు ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.
గోవా నుండి హైదరాబాద్ కు బయలుదేరిన ఎస్ జి 3735 విమానంలో నాగ్ పూర్ నుండే పొగ వస్తున్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వహించి అలాగే హైదరాబాద్ తీసుకువచ్చారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ మాస్కులు కూడా సరిగా పని చేయలేదని ప్రయాణీకులు తెలిపారు. రవ్ వే చివరలో అత్యవసర ల్యాండింగ్ అవ్వడంతో ప్రయాణీకులు దాదాపు 20 నిమిషాల పాటు వర్షంలోనే నిలబడాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణీకురాలు అస్వస్థతకు గురి కావడంతో ఆమెకు ఎయిర్ పోర్టు ఆసుపత్రిలో చికిత్స అందించారు.
కాగా ఈ ప్రమాదంకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. మరో వైపు స్పైేస్ జెట్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో తొమ్మిది విమానాలను అధికారులు దారి మళ్లించారు. వీటిలో ఆరు డొమెస్టిక్ విమానాలు, ఒక కార్గో విమానం, రెండు అంతర్జాతీయ విమానాలను బెంగళూరు, చెన్నైకి దారి మళ్లించారు.