Telangana Elections Counting: తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. గెలుపుపై ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా తో ఉండగా, హంగ్ వస్తే స్టీరింగ్ తమ చేతిలో ఉంటుందన్న భావనలో బీజేపీ, ఎంఐఎంలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరగనుంది. 500లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
రేపు (ఆదివారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచటెల భద్రత ఏర్పాట్లు చేశారు. తొలి ఫలితం పది గంటలకు వెలువడే అవకాశం ఉంది. చిన్న నియోజకవర్గాలకు సంబంధించి తొలి ఫలితాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉన్న నియోజకవర్గాల ఫలితం ఆలస్యం కానుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఆలస్యంగా పూర్తవుతుంది. అన్ని నియోజకవర్గాలకన్నా అక్కడే చివరి ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది అభ్యర్ధులు రంగంలో ఉండటంతో ఎక్కువ ఈవీఎంలను పరిశీలించాల్సి రావడంతో గజ్వేల్ ఫలితం అలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ఓట్ల కౌంటింగ్ భద్రతపై డీజీపీ అంజన్ కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సెంటర్ లో ఫలితాలు వస్తున్న సమయంలో, కౌంటింగ్ సెంటర్ బయట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్ల వారీగా వస్తున్న వివరాలను బట్టి కౌంటింగ్ సెంటర్ బయట పోలీసు బందోబస్తును పై అధికారులు సమీక్షించాలని చెప్పారు. అభ్యర్ధుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించాలని చెప్పారు. గెలిచిన అభ్యర్ధులు ర్యాలీ తీసే సమయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు డీజీపీ అంజన్ కుమార్.
KCR: ఎగ్జిట్ పోల్స్ అలా ఉన్నా గులాబీ బాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారా..! అందుకే ఈ చర్యలా..?