గత కొద్ది రోజులుగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ వారసుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పట్టాభిషేకం వార్త హాట్ టాపిక్ గా నడుస్తున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు కాబోయే ముఖ్యమంత్రి కేటిఆర్ అంటూ అభినందనలూ తెలియజేస్తున్నారు. కేటిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా పిక్స్ అయ్యిందన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు కేసిఆర్ గానీ, ఇటు కేటిఆర్ గానీ బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
అసలు విషయంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసిఆర్ కు దైవ భక్తి, గురు భక్తి చాలా ఎక్కువ. తొలి నుండి పండితుల సూచనలు, సలహాలు ఎక్కువగా పాటిస్తూ పూజలు, యాగాలు. హోమాలు చేస్తుంటారు. పీఠాధిపతులు, మఠాధిపతులు చెప్పిన వాటిని తూచ తప్పక పాటిస్తుంటారు. అందులోనూ త్రిదండి చిన జియ్యర్ స్వామిజీకి కేసిఆర్ అగ్రపీఠం వేస్తారు. చిన జియ్యర్ స్వామిజీకి కెసిఆర్ ఎంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేసిఆర్ నూతన గృహ గృహప్రవేశ సందర్భంలో సిఎం కేసిఆర్ కుర్చీలో చిన జీయర్ ను కూర్చోబెట్టి మరీ కెసిఆర్ దంపతులు ఆశీర్వాదం తీసుకుని ఆయన్ను గౌరవించారు. చిన జీయర్ సలహా మేరకే కేసిఆర్ తన కుమారుడు తారక రామారావుకు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.
తొలుత ఈ నెల 28న కేటిఆర్ ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ భావించారు. దీంతో పలువురు మంత్రులు పోటీలు పడి కెటిఆర్ కు కంగ్రాట్స్ చెప్పడం మొదలు పెట్టారు. అయితే తాజాగా ఆ ప్రతిపాదన మారిందని కేటిఆర్ ముఖ్య నేతలకు ఫోన్ చేసి ఈ అంశంపై మాట్లాడవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. డిప్యూటి స్పీకర్ పద్మారావు రైల్వే ఉద్యోగుల సమావేశంలోనే కేటిఆర్ అతి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రకటిస్తూ తమ శాసనసభ, రైల్వే కార్మికుల తరపున, అందరి తరపున కేటిఆర్ కు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా కెటిఆర్ తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతూ కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే అందరం కలిసి ఒకే మాటపై ఉండి మద్దతు తెలిపుతామని అన్నారు. ఇంకా తలసాని శ్రీనివాస యాదవ్ తదితర మంత్రులు కూడా ఈ విషయంపై మాట్లాడారు. అయితే కేటిఆర్ పట్టాభిషేకం ముహూర్తం ఫిబ్రవరి 18 లేదా 19 వ తేదీ ఉండవచ్చని, కెసిఆర్ కు చిన జియ్యర్ స్వామిజీ ఏ రోజు చెబితే ఆ రోజు కేటిఆర్ కు పట్టాభిషేకం జరుపుతారని అంటున్నారు.