Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్ ను సభలో ప్రవేశపెట్టారు భట్టి. అనంతరం ఆర్ధిక స్థితిపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ .. వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి చెప్పారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామన్నారు.
గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని, రోజు వారీ ఖర్చులకూ ఓడీ ద్వారా నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు భట్టి. ఇలాంటి పరిస్థితి రావడాన్ని తాను దురదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంతకు ముందు సమావేశాలు ప్రారంభం కాగానే ..ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని సాంబశివరావు పేర్లను సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
అయితే ..శ్వేత పత్రం బుక్ విడుదలపై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం తెలియజేశారు. అరగంట ముందు శ్వేతపత్రం విడుదల చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్ లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని కోరారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సైతం ఇదే రీతిలో డిమాండ్ చేయడంతో సభాపతి అరగంట పాటు అసెంబ్లీని వాయిదా వేసి టీ బ్రేక్ ఇచ్చారు. అయితే అరగంట ముందు 40 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమర్ధించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందని చెప్పారు. తాము కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. శ్వేతపత్రంపై సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
శ్వేత పత్రంలోని ముఖ అంశాలు
- రాష్ట్రం మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు
- 2014 – 15 నాటికి రాష్ట్ర అప్పు రూ.72,658 కోట్లు
- 2014 -15 నుండి 2022 – 23 మధయ్ కాలంలో సగటున 24,5 శాతం పెరిగిన అప్పు
- 2023 – 24 అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు రూ.3,89,673 కోట్లు
- బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికిమధ్య 20 శాతం అంతరం
- 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98 లక్షల కోట్ల వ్యయం
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది రెట్లు పెరిగిన రుణ భారం
- రెవెన్యూ రాబడిలో ఉద్యోగుల జీతాలకు 35 శాతం వ్యయం
- రోజూ వేస్ అండ్ మీన్స్ పై ఆధారపడాల్సిన దుస్థితి
- 2014 లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ..2023 లో అప్పుల్లో కూరుకుపోయింది
- బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ