BRS: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనానికి బీజం పడి నేటికి 13 ఏళ్లు అయ్యింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001 ఏప్రిల్ 27న శాసనసభ ఉప సభాపతి స్థానానికి, ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మరి కొందరు నాయకులతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో 54 స్థానాల్లో పోటీ చేయగా 26 స్థానాలు కైవశం చేసుకంది. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలతో మహాకూటమితో కలిసి టీఆర్ఎస్ పోటీ చేసినా పది స్థానాలు మాత్రమే గెలుచుకుంది.
2009 సెప్టెంబర్ 2న హెలికాఫ్టర్ ప్రమాదంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలైయ్యారు. ఆ తర్వాత కేసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర తరం చేశారు. అప్పటికే తెలంగాణ సాధన కోసం వివిధ రూపాల్లో ఉద్యమాలను నిర్వహించిన కేసిఆర్ .. చివరకు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో’ అంటూ ఆమరణ నిరహార దీక్షకు దిగడంతో తెలంగాణలో ఉద్యమం ఉధృతం అయింది. దీంతో దిగివచ్చిన యూపీఏ 2 ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రక్రియ ప్రారంభిస్తామంటూ 2009 డిసెంబర్ 9న ప్రకటన చేసింది ఈ రోజు నుండే తెలంగాణలో కాంగ్రెస్ పతనం ప్రారంభం అయ్యింది.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కూడా నాటి యుపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కేసిఆర్ హామీ ఇచ్చాడని ప్రచారం జరిగింది. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదని ఆ పార్టీ అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే 2013 అక్టోబర్లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, 2014 ఫిబ్రవరి 18న లోక్సభ, 20న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి హాండ్ ఇచ్చి కేసిఆర్ 2014 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్ఎస్ 63, 11లోక్సభ స్థానాలను గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 21 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో తెలంగాణలో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో పాటు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ను బలోపతం చేసే క్రమంలో భాగంగా టీడీపీ, వైఎస్ఆర్, బీఎస్పీ ఎమ్మెల్యేలతో పాటు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసిఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ బలహీనపడింది. ఆ తర్వాత 2018 డిసెంబర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లగా టీఆర్ఎస్ 88 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితం అయ్యింది. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ చేయపట్టి కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింత బలహీనపడింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నా ప్రజలు ఆ పార్టీని ఆదరించడం లేదు.
రెండు పర్యాయాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేసిఆర్ .. ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్రసమితి (టిఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) మార్పు చేస్తూ రెండు నెలల క్రితం సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపగా, అభ్యంతరాల పరిశీలనకు నెల రోజుల వ్యవధి తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్ననే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో నేడు కేసిఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు.