YS Sharmila: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక నిర్ణయం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో విలీనం చర్చలు బెడిసికొట్టడంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ అభ్యర్ధులను పోటీకి పెడతామని ఇటీవల షర్మిల ప్రకటించారు. షర్మిల పాలేరు నుండి పోటీ చేయనున్నారంటూ కూడా ఆ పార్టీ నేతలు సమావేశాలు నిర్వహించి వెల్లడించారు. కానీ అనూహ్యంగా ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ షర్మిల .. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. పోటీ నుండి ఎందుకు విమరించుకోవాల్సి వచ్చింది అనే విషయాలను వివరించారు.
*ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం ప్రజల కోసమేనని అన్నారు షర్మిల, కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. కేసీఆర్ ఓడిపోయేంత చాన్స్ ఉందనీ, ఈ తరుణంలో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దన్న ఉద్దేశంతోనే పోటీ నుండి విరమించుకున్నట్లుగా తెలిపారు. మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని అడగడం జరిగిందన్నారు. ఓటు బ్యాంకు చీలకుండా ఉంటే కాంగ్రెస్ కు ఒక చాన్స్ వస్తుందని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేఅవకాశాలు ఉన్నాయనీ, ఆ అవకాశాన్ని అడ్డుకోవడం ఇష్టం లేక పోటీ నుండి విరమించుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వైయస్ఆర్ కారణంగా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనీ,కాంగ్రెస్ నేతలు అంటే తనకు అపార గౌరవం ఉందని చెప్పారు వైఎస్ షర్మిల. వైయస్ఆర్ బిడ్డే కాంగ్రెస్ ఓడించడం సమంజసం కాదని మమ్మల్ని అడగడం జరిగిందని అన్నారు. ఇన్నేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అటు కర్నాటకలో ఫలితాలు చూపాయనీ, ఇటు తెలంగాణలోనూ గెలిచే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనను ఢిల్లీకి ఆహ్వానించి మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యూలర్ పార్టీ అని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను తాను చీలిస్తే ప్రజలు క్షమించరని అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని షర్మిల స్పష్టం చేశారు. పది రోజుల క్రితం తాము పోటీ చేస్తామని చెప్పామని, అయితే సమయం గడిచే కొద్ది కొన్ని నిర్ణయాలు బలపడుతుంటాయన్నారు. ఈ కొద్ది రోజుల్లోనే మేడిగడ్డ కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద జోక్ అని మరొక్కసారి ప్రజలకు అర్థం అయ్యిందని అన్నారు. కేసీఆర్ వేల పుస్తకాలు చదివానని చెబుతుంటారనీ, ఆ పుస్తకాల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు ఉన్నాయో లేవో..అని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ ఇప్పుడు టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్నారనీ, తాము పోరాటం చేసి లక్ష 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేంత వరకు వారికి తెలియదా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ చాలా ట్రాన్స్ పెరెంట్ గా నడిస్తే ఎందుకు పేపర్ లు లీక్ అయ్యాయిని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లుగా కేసీఆర్ ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావద్దు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని షర్మిల తెలిపారు.
తాను పోటీ చేస్తానని, ఎమ్మెల్యే అవుతానని అనుకున్నానని అన్నారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్రతో పోరాటం చేసిన తర్వాత ఈరోజు తీసుకుంటున్న నిర్ణయం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకు చాలా బాధ కలిగిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగాన్ని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు ఏకీభవిస్తారని నమ్ముతున్నాని అన్నారు. ఒక వేల కొంత మంది తనతో ఏకీభవించకపోయిన వారికి క్షమాపణ చెబుతున్నానన్నారు. మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదనీ, మనకు యుద్ధం చేసే సమయం వస్తుందని పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి అన్నారు షర్మిల.
పాలేరు ప్రజలకు తాను నిలబడతాను అని మాటిచ్చానని కానీ, ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పాలేరులో కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ అన్న నిలబడుతున్నారన్నారు. పొంగులేటి శ్రీనన్న అంటే తమకుగౌరవం ఉందని తెలిపారు. 2013లో 3100కిలో మీటర్ల పాదయాత్ర చేశాననీ, ఆ సమయంలో ఖమ్మం జిల్లా పాదయాత్రలో 500కిలో మీటర్లు తనతో పాటు శ్రీనన్న నడిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఎలక్షన్ కి నిలబడితే అమ్మ (విజయమ్మ) క్యాంపేయిన్ చేసిందన్నారు. ఇప్పుడు మొండిగా తెగించి శ్రీనన్నకు వ్యతిరేకంగా పోటీ చేయమంటారా పాలేరు ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలుపు ముఖ్యమే కానీ దాని కంటే త్యాగం గొప్పదని షర్మిల అన్నరు. ఎప్పటికైనా పాలేరులో తాను పోటీ చేస్తానని తెలిపారు.
Telangana Assembly Polls: కాంగ్రెస్ తో కటీఫ్ .. ఒంటరిగానే సీపీఎం పోటీ