YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డిప్యూటి సీఎం డీకే శివకుమార్ తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ కు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా షర్మిల చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య ఎన్నికల్లో పొత్తు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో డీకే శివకుమార్ తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే వారి మధ్య రాజకీయ పరమైన చర్చ జరిగి ఉండవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఒంటరిగా పోటీ చేస్తే పట్టుమని పది స్థానాలు కూడా గెలుచుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ పార్టీ కావడంతో కలిసి పోటీ చేయడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు షర్మిలకు లాభదాయకంగా ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం వైఎస్ఆర్ టీపీని విలీనం చేయాలని కోరుతోందని, అలా చేస్తే పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు ఏపి పార్టీ పగ్గాలు అప్పగించడానికి సిద్దంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ ఊపును తెలంగాణలో కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తుంది.
షర్మిల పార్టీకి ఎన్ని ఓట్లు పడినా అవన్నీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ కిందకే వస్తాయి. షర్మిల పార్టీ లేకపోతే ఆ ఓట్లు కాంగ్రెస్ కు ప్లస్ అవుతాయి. ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ షర్మిలను దగ్గర చేసుకునే పనిలో ఉంది. ఎలాగూ డీకే శివకుమార్ తో మంచి పరిచయాలే ఉన్నందున షర్మిలతో ఆ విషయాలపై మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏపిలో సోదరుడు జగన్ సీఎంగా ఉండటం వల్ల షర్మిల తెలంగాణలో రాజకీయాలు వదిలివేసి ఏపికి రావడానికి ఒప్పుకుంటారా..? లేదా తెలంగాణలోనే కొనసాగాలని కోరుకుంటారా..? విలీనానికి ఓకే చెబుతారా..? పొత్తుకు సై అంటారా..? అనే విషయాలు తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Breaking: రామోజీకి బిగ్ షాక్ .. రూ.793 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఏపీ సీఐడీ