జగన్ అనుకున్నట్టు జరగాల్సిందే. ఏదైనా జరిగిపోవాల్సిందే. లేదా జగన్ కి కాలుద్ది, కాలిందా అవతలి వాళ్లకు మూడుద్ది. అవతల వాళ్ళు వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, పార్టీ అయినా, సంస్థ అయినా ఎవరైనా సరే వారికి మూడాల్సిందే. జగన్ అనేవాడు పై చేయి సాధించాల్సిందే…! మండలిలో మూడు రాజధానుల బిల్లు నెగ్గలేదని దాన్ని రద్దుపై ప్రక్రియలు జరుగుతున్నాయి. అది పెద్దది కాబట్టి ఆలస్యం అవుతుంది. కానీ చిన్న చితక డాక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు అయితే వెంటనే సస్పెండ్ చేసేయొచ్చు, చేసేసారు. కానీ ఎన్నికల కమిషనర్ అనేవాడు ఉన్నత స్థాయి అధికారి… పాపం వైసిపి దూసుకెళ్తున్న సమయంలో ఎన్నికలను వాయిదా వేసాడు, జగనుకి కోపం వచ్చింది. మామూలుగా కాదు ఏ నాడు ప్రెస్ ముందుకు రాని జగను వెంటనే ప్రెస్ ముందుకు వచ్చేసి… నిమ్మగడ్డని చెడామడా వాయించేసి, కులం అని, కమ్మ అని, చంద్రబాబు పార్టీ అని, ఎల్లో పార్టీ అని కోపాన్ని ప్రదర్శించేసాడు. అక్కడితో ఆగలేదు, జగను ఈగో చల్లారలేదు. దానికి పర్యవసానమే ఈరోజు రహస్య జీవోలు. నిమ్మగడ్డని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తొలగించేలా, ఆయన పదవి కలం తగ్గిస్తూ జీవోలు వచ్చేసాయి. దీనిలో జగన్ చాణక్యత, అవగాహనా అద్భుతమే. తనకు తెలియకపోయినా నిపుణులను పిలిపించుకుని పక్కాగా అమలు చేసారు, జీవోలు తెచ్చారు. అంతా పకడ్బందీగా, వ్యూహాత్మకంగా జరిగిపోయింది.
జీవోలు ఏం చెప్పాయి? ఎలా వచ్చాయి?
ఎన్నికల కమిషనర్ ని మార్చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ ఉండకపోవచ్చు. కేంద్రం సహకారం కావాలి, పార్లమెంటులో మెజార్టీ సభ్యుల ఆమోదం ఉండాలి. అది జరగదు. అందుకే వేరే దారి. అవును…! ఇంటికి ముందు దారి లేకపోతే పక్కదారి ఉందిగా.., ఏదో దారిన వెళ్లే అవకాశం ఉందిగా…! అదే జగన్ ఆలోచించారు, మాజీ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి, ఇతర ముఖ్యుల ద్వారా చట్టాలు తెలుసుకుని, కూపీలాగి అమలు చేసారు. రాజ్యాంగంలోని 243 (కె) ఆర్టికల్ ప్రకారం ఎన్నికల కమిషనర్ జీత భత్యాలు, పదవి కాలం, ఎన్నిసార్లు ఆ పదవిలో ఉండొచ్చు? ఏ స్తాయి వారు ఉండాలి? అనేది ఓ చట్టం ద్వారా రూపొందించవచ్చు. అదే జగనాస్త్రం, అదే జగన్మంత్రం అయ్యింది. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని అయిదేళ్ల నుండి మూడేళ్లకు కుదించేసి, రమేష్ కి పని అయిపొయ్యేలా, ఆయన కు గడువు తీరిపోయేలా ఆర్డినెన్సు తెచ్చారు. వెంటనే గవర్నర్ దాన్ని ఆమోదించారు. ఇక వెను వెంటనే రమేష్ కుమార్ ని తప్పిస్తూ జీవో తెచ్చారు.
ఇంకా ముందుంది… కోర్టుల కాలం…!
ఇక్కడితో అవ్వలేదు. 243 (కె) లో చాల కీలక అంశాలున్నాయి. ఇది పంచాయతీరాజ్ చట్టాలతో ముడిపడిన అంశం. ఎన్నికల కమిషనర్ అంటే హైకోర్టు జడ్జితో సమానుడు. అతన్ని తొలగించాలన్న, పదవి కాలాన్ని కుదించేయాలన్నా పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. కానీ రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ అధికారం చూసుకున్నా చట్టంలో మార్పులు చేసి పదవి కాలం తగ్గించవచ్చు అని జగన్ అండ్ కో భావిచి అమలు చేసింది… ఇది ఇక్కడితో ఆగదు. కచ్చితంగా కోర్టుకి వెళ్తుంది. నిమ్మగడ్డ రమేష్ అనేవాడు కూడా పోరాడే మనిషే, కులం, రాజకీయం, తంత్రం తెలిసిన మనిషే… అందుకే ఎన్నికల వాయిదాలో ముందున్నాడు, తనకు కేంద్ర బలగాల రక్షణ కావాలని కోరాడు. అందుకే రమేష్ కచ్చితంగా పోరాటం మొదలు పెడతాడు. ఒకవేళ ఆయన వెనక్కు తగ్గినా ఈ చంద్రబాబు, అండ్ కో మాత్రం వెనుక నుండి నడిపిస్తుంది…. అందుకే కరోనా వేళలో మనకు మరో సరికొత్త రాజకీయ, అధికార చిత్రాలు, స్టెంట్లు, ట్విస్టులు, డ్రామాలు కనిపించనున్నాయి. ఈ మొత్తం డ్రామాల్లో, సినిమాల్లో బిజెపి పాత్ర మాత్రం రాష్ట్రం పరిధిలో ఒకలా, కేంద్రం పరిధిలో మరోలా ఉండనుంది. (అది మరో కథనంలో చెప్పుకుందాం).
– శ్రీనివాస్ మానెం