(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
నోరు అదుపు, మాట పొదుపు అనే సామెత అందరికి తెలిసే ఉంటుంది. సాధారణ ప్రజానీకం గానీ రాజకీయ నాయకులు కానీ ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కానీ ప్రభుత్వ విధులు నిర్వహించే అధికారులకు, ఉద్యోగులకు కొన్ని పరిధులు ఉంటాయి. వారు మాట్లాడే మాటలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి, ప్రతిపక్ష పార్టీ నేతలకు అస్త్రాలుగా మారితే అధికారపక్షం చూస్తూ ఊరుకుంటుందా?.
ఈ క్రమంలోనే విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ మొన్న సస్పెన్షన్ కు గురి కాగా నేడు చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామిరెడ్డి వంతు అయింది. అయితే సస్పెన్షన్ చేయాల్సిన తప్పు వారు చేశారా అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది.
ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారు ఇష్టానుసారం మాట్లాడకూడదనే నిబంధన ఉన్నా యూనిఫామ్ సర్వీసులో ఉన్న వారు, కొందరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ లు పెట్టి ఆయా శాఖల్లోని విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి.
ఇంతకూ ఈ అధికారులు చేసింది ఏమిటంటే…కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్ లు ప్రభుత్వం సరఫరా చేయలేదని, ఈ పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులను ఎలా నిర్వహిస్తారని నర్సీపట్నం వైద్యుడు సుధాకర్ మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ వైద్యుడి మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. దీనితో ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.
ఇది జరిగి 24 గంటలు కాకమునుపే నగరి మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అయితే ఈయన ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడినట్లు లేదు. కరోనా నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాల నుండి సహకారం లేకపోయినా ఎమ్మెల్యే రోజా తన సొంత ఖర్చులతో సహాయ సహకారాలు అందిస్తున్నారని, మున్సిపాలిటీ అకౌంట్స్ ఫ్రిజ్ అయి ఉండి, ప్రభుత్వం నుండి మాస్కులు ఇతర సామాను సరఫరా కాకపోయినా ఎమ్మెల్యే రోజా సహకారంతో విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని సెల్ఫీ వీడియోలో ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే రోజాను పొగడ్తలతో ముంచెత్తి ప్రస్తుత పరిస్థితులను వివరించారు.
డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై దళిత సంఘాల నేతలు స్పందించారు. దళితుడైన వైద్యాధికారిని సస్పెండ్ చేయటం అన్యాయమని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులు తెలియచేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. నగరి కమిషనర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే అన్నట్లు నగరి కమిషనర్ వెంకట్రామిరెడ్డినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సస్పెన్షన్ పనిష్మెంటా, వరమా?
ప్రభుత్వ ఉద్యోగులకు సస్పెన్షన్ పనిష్మెంటేనా?. సస్పెన్షన్ కాలంలో సగం జీతం చెల్లిస్తారు. తరువాత ఉద్యోగంలో తిరిగి చేరిన తరువాత మొత్తం కాలానికి మిగిలిన జీతం చెల్లిస్తారు. కాకపోతే ‘పై’ ఆదాయం పొందే కొందరు అధికారులు అది కోల్పోతారు.
గతంలో ఇటువంటి సందర్భాలలో సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇంక్రిమెంట్ కట్ చేయడం, లేదా పనిష్మెంట్ గా ఏజన్సీ ఏరియాలకు, లేదా అప్రాధాన్యత పోస్టులకు బదిలీ చేయడం జరుగుతుండేది. అయితే ఇప్పుడు ఓకే మంత్రంగా సస్పెండ్ చేయడం ఆనవాయితీగా మారింది. అయితే పై ఇద్దరు అధికారుల సస్పెన్షన్ లను ప్రతిపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి.