‘అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట’ ఇది ఒ పాత సినిమాలోని హిట్ సాంగ్. అందరూ చాలా బాగా గుర్తు ఉండే పాట. చాలా సందర్భాలలో ఈ పాట జ్ఞప్తికి వస్తుంటుంది. ఇప్పుడు ఈ పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అనువుగా ఉంటుంది అంటున్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత అనేక అటు పోటులను, సంక్షోభాలు, విజయాలు, పరాజయాలు చవి చూసింది. అయితే 2019 ఎన్నికల నాటి ఘోర పరాజయం ఎన్నడూ చూడలేదు. కేవలం 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వరకు మాత్రమే ఉండేది. పార్టీల పరంగా విభేదాలు ఉన్నా వ్యక్తులుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేవారు. అయితే గతంలో తమిళనాడు తరహా పాలిటిక్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను ఆర్ధికంగా దెబ్బతీయడం, కేసులు పెట్టడం, అరెస్ట్ లు జరగడం. ఇది ఏపిలో నయా ట్రెండ్.
ఇదంతా చంద్రబాబు ముందే గ్రహించినట్లు ఉన్నారు. అందుకే తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువా కప్పుకోవడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారేమో. చంద్రబాబు కు అత్యంత సన్నిహితులైన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావు లు బీజేపీలో చేరిన సమయంలోనే చంద్రబాబే వారిని బిజెపి గూటికి పంపారని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు కు సహాయం చేసేందుకే వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారని పేర్కొన్నారు. ఇటీవల మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటల్ లో సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తో భేటీ కావడం వెనుక చంద్రబాబు ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే బీజేపీలో చేరిన ఆ నలుగురు వారి వారి వ్యక్తి గత ప్రయోజనాలే చూసుకుంటున్నారని, చంద్రబాబు కు ఏ మాత్రం ఉపయోగ పడటం లేదని టాక్ నడుస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో ఇద్దరు మాజీ మంత్రులు అరెస్ట్ అయిన సందర్భాల్లోనూ వారు నోరు మెదపకపోవడం చూసిన వారు చంద్రబాబు అనుకున్నది ఒక్కటి, అయ్యింది మరొకటి అని వ్యాఖ్యానిస్తున్నారుట.