(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సిఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణం కేసులో సీఐడీ, ఏసిబి అధికారుల దర్యాప్తు వేగవంతం అయ్యింది. అధికారుల విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ చెక్కుల ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 117 కోట్లు కాజేసేందుకు ఒక ముఠా విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. మూడు సిఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల ద్వారా ఇటీవల దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ద్వారా రూ.117 కోట్లు కాజేసేందుకు కొందరు యత్నించగా బ్యాంక్ అధికారులు అవి నకిలీ చెక్కులుగా గుర్తించడంతో చెల్లింపులు నిలిపివేసి ఏపి ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్రంగా స్పందించి ఏసిసి దర్యాప్తునకు ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏసిబి, సిఐడి అధికారులు రంగంలోకి నకిలీ చెక్కుల ద్వారా 117 కోట్ల రూపాయలు కొట్టేయడికి ప్రయత్నించింది వేరువేరు వ్యక్తులా లేక ఒక ముఠానా, నకిలీ చెక్కులు ఎక్కడ తయారు అయ్యాయి తదితర అన్ని విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే రాష్ట్రంలో ఇదే తరహాలో వేరు వేరు ప్రాంతాల్లో ఇప్పటికే కొందరు లక్షల్లో సొమ్ము కాజేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇవి తక్కువ మొత్తంలో కావడంతో వెలుగులోకి రాలేదు.
కడప జిల్లా పొద్దుటూరులో భాస్కరరెడ్డి అనే వ్యక్తి నకిలీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా లక్షల్లో డబ్బుల్లో డ్రా చేసినట్లు వెల్లడైంది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మలేపాడుకు చెందిన వినయ్ కుమార్ రూ.3.60వేలు, ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ రూ.3.40లక్షలు, వైఎంఆర్ కాలనీకి చెందిన మహమ్మద్ రహీమాన్ రూ.2.95 లక్షలు నకిలీ సీఎంఆర్ఏఫ్ చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుుల కేసు నమోదు చేశారు. దీంతో ప్రధాన నిందితుడు భాస్కరరెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. తమిళనాడు రాష్ట్రం హోసూరులో తన స్నేహితుడుకి సీఎంఆర్ఎఫ్ అసలు చెక్కులను పంపి నకిలీ చెక్కులు తెప్పించి తన స్నేహితుల ద్వారా బ్యాంకులో చెక్కులు మార్చుకున్నట్లు ప్రధాన నిందితుడు భాస్కరరెడ్డి పోలీసులకు తెలిపాడు.
నకిలీ చెక్కులు తమిళనాడులోని హోసూరులో తయారు అవుతున్నట్లు తెలుసుకున్న విచారణ అధికారులు రూ.117 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించింది ఎవరు, వారికి సీఎంఆర్ఏఫ్ చెక్కులు ఎలా వచ్చాయి. చెక్కులు జారీ అయిన అసలు లబ్దిదారులు ఎవరు. ఎవరి ద్వారా వారికి చెక్కులు వెళ్లాయి తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు.