నక్సలిజం.. నక్సలైట్లు వ్యవస్థతో ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి పోరాడుతున్నాయి. ఒక నక్సలైట్ తాను మారి జన జీవన స్రవంతిలో కలిసి పోతామంటే ప్రభుత్వం, పోలీసులు ఎంతో సంబర పడతాయి. వారి జీవితానికి సరిపడా సంతోషాన్ని ప్రసాదిస్తాయి. అటువంటి దశలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే నక్సలిజం దారికి వస్తున్న దశలో ఒ వ్యక్తి ఏకంగా నేను నక్సలైట్ గా మారిపోతాను అవకాశం ఇవ్వండి అని రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనమే. ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు ఆలోచించాల్సిన విషయమే. దీని వెనక రాజకీయ కోణాన్ని కుల మత వర్గ కోణాన్ని పక్కనపెడితే వ్యక్తిగా అతను అలా ఎందుకు అనాల్సి వచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అన్నగా మారడమే పరిష్కారమా? అనేది ఆలోచించాల్సి ఉంది. రాజకీయ దృష్టితో చూసి ఉంటే అటువంటి ఆలోచనను పక్కన పెట్టి అతని బాధ్యతను తీసుకొని మనిషిగా ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పైన ఉంది. అసలు ఈ మాట సీఎం జగన్ కు వినిపించిందా? లేదా? తన రాష్ట్రంలో ఓ అల్ప వర్గానికి చెందిన వ్యక్తి నేను నక్సలైట్ గా మారతాను అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్రపతి కి లేఖ రాయడం వెనుక ఏం జరుగుతుంది అనేది జగన్ పసిగట్టారా? లేదా? అనేదే ఇప్పుడు కీలకం.
అన్న బాటలోకి వెళ్లడమే పరిష్కారమా?
కాలం మారుతున్నా, వారిలో సిద్ధాంతాలు మారుతున్నా, నక్సలైట్ లను తుదముట్టించేసాం అని పాలకులు, పోలీసులు ప్రకటించుకుంటున్నా ఇంకా ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతి సారి అటు వైపు చూస్తున్నారు అంటే చట్ట సమాజంలో దొరకని న్యాయం అక్కడ లభిస్తుంది అన్న నమ్మకం ఇంకా ప్రజలలో ఉండి అనుకోవాలా? అందుకే శిరోముండనం బాధితుడు ప్రసాద్ ఈ విధంగా రాష్ట్రపతికి లేఖ రాశాడా? నిత్యం అనేక రకాల విజ్ఞప్తులు రాష్ట్రపతికి వెళుతున్నా ఈ విషయంలో అయన వెంటనే స్పందించారు అంటే..బాధితుడు ఎంత కలత చెందాడు అన్న విషయం లేఖ ద్వారా స్పష్టం కావడమే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..ఒక లేఖకు రాష్ట్రపతి వెంటనే స్పందించి ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో బాధితులకు ఏదోఒక స్టేజిలో న్యాయం జరుగుతుంది అన్న నమ్మకాన్ని కల్గించారు.
దీనిపై సీఎం జగన్, పోలీస్ వ్యవస్థ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాష్ట్రపతి నియమించిన అధికారి విచారణ పూర్తి అయిన తరువాత ఎటువంటి పరిష్కారం లభిస్తుంది అన్న దానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.