ప్రింట్ మీడియా పనైపోతుంది…! ఇది నిజానికి ఎన్నాళ్ల నుండో వినిపిస్తున్న మాట. కానీ ఇప్పుడు కరోనా కల్లోలం పత్రికారంగాన్ని నిలువునా ముంచేసింది. సోషల్ మీడియా సాంకేతికం, వెబ్ మీడియా వేగంతో పోటీ పడలేక చతికిలపడుతున్న ప్రింట్ మీడియాకు గడిచిన అయిదేళ్ళుగా ఆటుపోట్లు తప్పడం లేదు. కేవలం డిసెంబర్, జూన్ నెలలో ఆడిటింగ్ సమయంలో సర్క్యులేషన్లు పెంచుకుని చూపించుకుని ఏదోలా నెట్టుకొస్తున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కరోనా ప్రభావం ప్రింట్ మీడియాపై బాగా పడింది.
ఈనాడుకి దిక్కు తోచట్లేదు…!
ఈనాడు ప్రస్తుతం తెలుగు నాట అతిపెద్ద ప్రింట్ మీడియా సంస్థ. దాదాపు 15 లక్షల సర్క్యులేషన్ తో అగ్రగామిగా ఉంది. 2018 డిసెంబర్ నాటికి 18.53 లక్షలు ఉన్న సర్క్యులేషన్ 2019 డిసెంబర్ నాటికి 16 లక్షలకు పడింది. ఇక ఈ ఏడాది జనవరి నుండి పడుతూ వస్తుంది తాజాగా కరోనా కారణంగా గడిచిన 15 రోజులుగా కాపీలు వెనక్కు వస్తున్నాయి.
- హైదరాబాద్ సిటీలో మొత్తం రెండున్నర లక్షల సర్క్యులేషన్ ఉండగా, రోజూ 90 వేల కాపీలు తిరిగి ఆఫీస్ కి వచ్చేస్తున్నాయి. కొందరు వెయొద్దు ఆపేయమని, మరికొందరు బాయ్స్ దొరక్క… ఇలా రోజు ఇబ్బందులు తప్పడం లేదు.
- ఇక వైజాగ్, విజయవాడ, తిరుపతి వంటి సిటీలో కలిపి ఈనాడు 3 లక్షలు కాపీలు వేయాల్సి ఉండగా… ప్రస్తుతం 2 లక్షలు మాత్రమే వెళ్తున్నాయి.
- ఈనాడుకి కరోనా దెబ్బ కారణంగా రోజుకి సుమారుగా 5 లక్షల కాపీలు వెనక్కు వస్తున్నాయి. అక్షరాల రూ. 1.50 కోట్లు నష్టమని చెప్పవచ్చు.
ఇతర పత్రికలకు పూర్తిగా ఢీలా…!
మహారాజుగా ఎదిగిన ఈనాడు పరిస్థితి అలా ఉంటే… ఇక సాక్షి, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు వంటి పత్రికలు కరోనా ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. సాక్షికి రోజుకి లక్షన్నర, ఆంధ్రజ్యోతికి 60 వేలు కాపీలు వెనక్కు వస్తున్నాయట. అందుకే ఆంధ్రజ్యోతిలో జిల్లా సంచిక ప్రింట్ ఆపేసారు. సాక్షి పత్రికని మాత్రం వాలంటీర్లు ద్వారా ఆ ప్రాంతాల్లో ఎలాగోలా విక్రయిస్తున్నారు. నాయకులు, సచివాలయ సిబ్బంది ద్వారా సాక్షిని స్థానికంగా ఉంచుతున్నారు. తిప్పి పంపడం లేదు. ఇలా ఒక్కో పత్రిక ఒక్కోలా తమ నష్టానికి పరిష్కారం వెతుక్కునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా పత్రికను ఇళ్లకు చేరవేసే బాయ్స్ రాకపోవడం పెద్ద దెబ్బగా మారింది. నెలవారీ చందాలు వసూలు కావట్లేదు. గడిచిన ఆరునెలలుగా పత్రికలకు ఇబ్బందులు ఆరంభమవ్వగా ఇప్పుడు చరమదశకు చేరుకున్నాయి.
తాత్కాలికమా.. పూర్తిగా మానేస్తే…!
పత్రికలకు పాఠకులను చేర్చడం చాలా కష్టం. ఒకప్పుడు పత్రిక అంటే ఒక ఇమేజ్, ఒక ప్రత్యేకత ఉండేవి. ఇప్పుడు లేవు. ప్రతి పత్రికకు సొంత అజెండాలు ఉన్నాయి. అందుకే చదివేవారు వర్గాలుగా ఉన్నారు. ప్రింట్ మీడియాలోని ప్రతి పత్రిక పిడీఫ్ ఎడిషన్లు ఉదయాన్నే సోషల్ మీడియాల్లో వాటున్నాయి. ఆన్లైన్ ఎడిషన్లు వస్తున్నాయి. ఫోన్లో చూస్తూ పత్రిక చదవడం అలవాటైన తర్వాత నేరుగా నెలనెలా బిల్లు చెల్లించి పత్రికను కొని చదవడం కష్టమే. అందుకే ఆరు నెలల నుండి పత్రికారంగం కిందకు పడుతుంది. కరోనా ప్రభావంతో చాలా కిందకు వెళ్తుంది. ఇది పైకి లేస్తుందో, లేదో కూడా తెలియని పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయి. ఒకసారి పత్రికను ఆపేసిన కస్టమర్, రీడర్ మళ్ళీ వేసేందుకు అంగీకరించడం దాదాపు అసాధ్యమే. అందుకే ఉచితంగా అయినా ఇస్తుంటారు, కానీ పత్రికల రీడర్స్ ని మాత్రం కోల్పోరు. కానీ ఇప్పుడు ఉచితంగా ఇస్తామన్న కరోనా అంటూ బాయ్స్ వేయడం లేదు, రీడర్స్ వేయించుకోవడం లేదు. ఇది తాత్కాలికంగానా, కరోనా తగ్గిన తర్వాత మళ్ళీ ఊపండుకుంటుందా అంటే 99% ఇక అసాధ్యమే. ప్రింట్ మీడియాపై సన్నగిల్లతున్న నమ్మకం…, దూసుకెళ్తున్న వెబ్ మీడియా కారణంగా ఇక మళ్ళీ పుంజుకోవడం అసాధ్యమే.