(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ వర్గాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించారు. దేశంలో వైరస్ విజృంభణను అరికట్టడానికి 21 రోజుల పాటు దేశాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్బంధం అమలు అయ్యే ఈ సమయంలో దేశంలో ఎవరూ ఇంటి నుండి బయటకు అడుగు పెట్టకూడదని నిర్దేశం చేశారు. ఈ చర్యల కారణం పేద మధ్య తరగతి వర్గాలు, రైతులు, మహిళలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. కేంద్ర ప్యాకేజీ వివరాలు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.
రైతులు, మహిళలకు
8.69 కోట్ల మంది రైతులకు రూ.2 వేల చొప్పున ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా తక్షణమే ఈ సాయాన్ని విడుదల చేస్తామనీ, ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి ఈ మొత్తం జమ అవుతుందనీ ఆమె వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.2 వేల చొప్పున ఒక్కో కార్మికుడికి వేతనం పెంచుతున్నట్టు తెలిపారు. దీని వల్ల 5 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, పించనుదారులకు రెండు విడతల్లో అదనంగా రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తామన్నారు. మధ్యవర్తులతో సంబంధం లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా మూడు నెలల్లో ఈ మొత్తం జమచేస్తామని నిర్మల వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా 3 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని ఆమె తెలిపారు.
జన్ధన్ ఖాతాలు కలిగిన 20 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.500 చొప్పున వచ్చే మూడు నెలల పాటు పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు. ఉజ్వల పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాదాపు 8.3 కోట్ల కుటుంబాలకు వచ్చే మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించనున్నారు. తద్వారా వారికి వంటగ్యాస్ కొరత రాకుండా ఆదుకుంటారు
స్వయం సహాయక బృందాలకు ప్రస్తుతం ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. దీని ద్వారా 7 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతారు.
వైద్య సిబ్బందికి
లాక్ డౌన్ సమయంలో సేవలు అందిస్తున్న వైద్య అధికారులు. నర్సులు. ఆశా వర్కర్లకు యాభై లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పేద కుటుంబాలకు
80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న 5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తారు. ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తారు. మూడు నెలల పాటు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తారు.
వికలాంగులకు, వృద్దులకు
వితంతువులకు వికలాంగులకు వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
చిన్న వేతన ఉద్యోగులకు
దేశవ్యాప్తంగా రూ.15,000 కంటే వేతనం తక్కువ ఉన్న ఉద్యోగస్తులకు ప్రావిడెంట్ ఫండ్ వాటాను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.