భారత వాయుసేన అమ్ముల పొదిలోకి అత్యంత ప్రతిష్టాత్మక రఫెల్ యుద్ధ విమానాలు చేరే సమయం దగ్గర పడింది. ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భవిస్తూ ఎదురుచూస్తున్న రఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్ కు బయలు దేరాయి. ఇస్ట్రెస్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన ఐదు రఫెల్ ఫైటర్ జెట్స్ మార్గ మధ్యలో యూఏఈలోని అబుదాబి సమీపంలోని అల్దాఫ్రా ఫ్రెంచ్ ఎయిర్బేస్ వద్ద బ్రేక్ స్టాప్ తీసుకోనున్నాయి. సుమారు 7,364 కిలో మీటర్లు ప్రయాణించి ఎల్లుండి (బుధవారం) అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్ కు చేరనున్నాయి.
రూ.59 వేల కోట్ల వ్యయంతో 36 రఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు 2016లో ఫ్రాన్స్ తో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేశాయి. కాగా ఈ విమానాల కోసం 36 మంది ఐఏఎఫ్ పైలట్లు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం ఆ యుద్ధ విమానాలు దశల వారీగా భారత దేశానికి చేరనున్నాయి. తొలి దశలో భాగంగా వస్తున్న ఈ ఐదు యుద్ధ విమానాల్లో రెండు ట్రైనర్ విమానాలు, మూడు యుద్ధ విమానాలు ఉన్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల 29న హర్యానాలోని అంబాలాకు ఈ ఐదు రఫేల్ యుద్ధ విమానాలు చేరుకోవాల్సి ఉంది. అనుకున్న సమయానికే అవి చేరనున్నాయని అధికారులు చెబుతున్నారు.