బెంగళూరు: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దక్షిణ బెంగళూరు ఎంపీ టికెట్ పొందిన బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య మీదే ఇప్పుడు అందరి కళ్లు పడ్డాయి. 28 ఏళ్ల వయసులోనే అంత కీలక నియోజకవర్గంలో పోటీచేసే అవకాశం లభించడంతో అందరూ అతడివైపే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐదేళ్ల క్రితం అతడు చేసిన ట్వీట్ ఒకటి అతడి ఖాతాలోంచి డిలీట్ అయిపోయింది. న్యాయవాద విద్య చదివి, బీజేపీ యువజన విభాగం నాయకుడిగా ఉన్న తేజస్వి.. గతంలో పార్లమెంటులో మహిళలకు మూడోవంతు కోటా ప్రతిపాదిస్తూ చేసిన బిల్లును వ్యతిరేకించారు. పార్టీలతో సంబంధం లేకుండా అప్పట్లో చాలా కాలం పాటు పలువురు పురుష ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా అడ్డుకున్నారు.
తనకు ఈ బిల్లంటే భయమేస్తోందని అప్పట్లో తేజస్వి సూర్య అన్నారు. ‘‘పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు తప్ప, మోదీ ప్రభుత్వ ఎజెండా స్ఫూర్తిదాయకంగా ఉంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు సాకారమవుతుందేమోనని భయమేస్తోంది’’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత.. 2014 జూన్ నెలలో ఈ ట్వీట్ చేశారు. తేజస్వి సూర్య అభ్యర్థిత్వం ఖరారు కాగానే మీడియా సంస్థలన్నీ అతడి గురించి తెలుసుకోడానికి గతం తవ్వడం మొదలుపెట్టడంతో ఆ ట్వీట్ బయటపడింది. ఇప్పటికీ అలాగే భావిస్తున్నారా అని కూడా కొంతమంది అడిగారు. దాంతో ఎందుకొచ్చిన ఇబ్బంది అని ఆ ట్వీట్ ను ఆయన డిలీట్ చేసేశారు.
దక్షిణ బెంగళూరు స్థానం నుంచి దివంగత కేంద్ర మంత్రి అనంతకుమార్ భార్య తేజస్విని పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ప్రకటించారు. అయితే అనుకోకుండా ఈ అవకాశం కర్ణాటక హైకోర్టు న్యాయవాది అయిన తేజస్వికి దక్కింది. మంచి వాగ్ధాటి ఉండటం, యువకుడు, విద్యావంతుడు కావడం, ముందు నుంచి పార్టీకి అనుబంధంగా పెరగడంతో అవకాశం వరించింది. విమర్శకులు సైతం ఆయన ప్రసంగాలను, వాగ్ధాటిని ప్రశంసించకుండా ఉండలేరు. కర్ణాటకలో ఒక బీజేపీ ఎమ్మెల్యే మేనల్లుడు, ఆర్ఎస్ఎస్ తో బలమైన సంబంధాలు ఉన్నవాడు కూడా. తనకు అవకాశం రావడంతో ఆయన మొదట సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.