కరోనా మహమ్మారి నుండి పూర్తి స్థాయి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని దేశ ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. ఇప్పటికే మూడు వ్యాక్సిన్ సంస్థలు తాము తయారు చేసిన టీకాలను అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తులు పెట్టుకున్నాయి. భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫైజర్ సంస్థలు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసిజిఐ)ను కోరాయి. వీటిపీ సిడీఎస్సీఓ (కమిటీ ఆఫ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) నిపుణుల కమిటీ తన సిఫార్సులను ఇస్తే వాటి ఆధారంగా డీసీజీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
దీంతో కొద్ది రోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ భారత్లో అందుబాటులోకి రావచ్చని భావిస్తున్న తరుణంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. అత్యవసర వినియోగానికి అనుమతి విషయంలో తొందర పడవద్దని పేర్కొంది. ఆనంద్ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు విషయాలపై చర్చించి కీలక సూచనలు చేస్తూ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. కరోనా వ్యాక్సిన్ ట్రయిల్స్ సంతృప్తికంగా పూర్తయి, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తరువాతనే వినియోగానికి అనుమతులు ఇవ్వాలనీ, నిబంధనల ప్రకారం అన్ని దశల పరీక్షలు పూర్తి అయిన తరువాతే టీకా వినియోగంపై నిర్ణయం తీసుకోవాలనీ వెల్లడించింది. టీకా తయారీ తరువాత తొలుత చిన్న జంతువులపై, ఆపై మనుషులపై పలు దశల్లోనూ పరీక్షించి ఫలితాలు విశ్లేషించడం తప్పనిసరి అని స్టాండింగ్ కమిటీ గుర్తు చేసింది.
వ్యాక్సిన్ పంపిణీలో తొందర పాటుతో నిర్ణయాలు తీసుకోకూడదని సూచించింది. ఈ మేరకు “మేనేజ్మెంట్ ఆఫ్ కోవిడ్ – 19 పాండమిక్ అండ్ కో ఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్” పేరిట నివేదికను కేంద్రానికి అందజేసింది. వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన మౌళిక వసతులు, శీతల గిడ్డంగులు, సైడ్ ఎఫెక్స్ వస్తే వారికి అందించాల్సిన చికిత్సలు తదితరాలపైనా కమిటీ పలు సిపార్సులు చేసింది.