ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు ఆయుర్వేద సంస్కృతంలో త్రిఫలాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మన శరీరంలో ఏర్పడే అనేక రోగాలకు త్రిఫలాలు మంచి ఔషధంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. త్రిఫల చూర్ణం మూడు రకాల పండ్లతో అమ్లాకి (ఎంబిలికా అఫిసినాలిస్), బిబిటాకి (టెర్మినీయా బెల్రికా), మరియు హరిదాకి (టెర్మినియా సెబులా) తో తయారు చేస్తారు.ఈ త్రిఫల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందినప్పటికీ వీటిని పరిమితికి మించి తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పరిమితికి మించి త్రిఫలాలు తీసుకోవటం ద్వారా జీర్ణాశయంలో తిమ్మిరి, విరేచనాలు కడుపులో నొప్పి వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. మీరు ఏ విధమైనటువంటి త్రిఫలాలు తీసుకుంటున్నారో దాన్నిబట్టి వాటి లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రతరం అవుతుంటాయి. ఇది గమనించిన వెంటనే త్రిఫల వాడుకను కొద్దిరోజుల పాటు తగ్గించడం ఎంతో శ్రేయస్కరం.
గర్భం దాల్చిన మహిళలు వీలైనంత వరకు ఈ త్రిఫలాలకు దూరంగా ఉండటం ఎంతో శ్రేయస్కరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ త్రిఫల ఉత్పత్తులలో ఒకటైన హరిదాకి గర్భిణీలలో అధిక రక్తస్రావం అవడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా గర్భవతులలో ఎక్కువ శాతం ప్రతికూల పరిస్థితులతో సంబంధం కలిగి ఉండటం వల్ల గర్భవతులు త్రిఫల చూర్ణానికి దూరంగా ఉండమని చెబుతారు.
త్రిఫలాలో ఎక్కువగా యాంటీబయోటిక్ లక్షణాలు ఉంటాయి. మధుమేహ సమస్యతో బాధపడే వారు ఎక్కువ భాగం వీటిని తీసుకోవటం ద్వారా వారిలో రక్తపోటు ప్రమాదకరమైన స్థాయిలో తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. త్రిఫలాలో ఉండే సార్బిటాల్, మెంతోల్ స్థాయిలు ప్రమాద కారణాలుగా చెప్పవచ్చు. రక్త పోటు సమస్యతో బాధపడే వారు త్రిఫలాలు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. ప్రతిరోజు ఈ ఫలాలను 500 మిల్లీ గ్రాముల నుంచి ఒక గ్రాము మోతాదుకు మించి తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు