రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కులం చుట్టూ తిరుగుతున్నాయా అన అనుమానం రాకపోదు. జగన్ రెడ్డి.. అని పవన్ సంబోధించడాన్ని వైసీపీ నేతలు సహించలేక పవన్ నాయుడు అని సంబోధించడం తెలిసిందే. సీఎం జగన్ కూడా చంద్రబాబు సామాజిక వర్గం.. అంటూ మాట్లాడటం కూడా తెలిసిందే. ఇదే తరహాలో సీపీఐ రామకృష్ణ కూడా కొందరికి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న రామకృష్ణను కమ్మ సామాజిక వ్యక్తిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.
చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు. దీనిని సీపీఐ నాయకులు ఖండిస్తున్నారు. వైసీపీ కుల రాజకీయాలకు రామకృష్ణను బలి చేయడం తగదని అంటున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున ఆయన్ను.. ‘కమ్యునిస్టు.. రామకృష్ణ చౌదరి..’ అంటూ కులానికి అంటగడుతూ వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడుతున్నారు. కుల రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీనేనని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ఇన్ చార్జిలుగా విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడి, వైవీ సుబ్బారెడ్డిలకు అప్పగించారు.. ఇది రెడ్ల ఆధిపత్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీల్లో 130 మందిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల ఓపెన్ కోటా నియామకాల్లోని 70 మందిలో 46 మంది రెడ్లు కాదా అని ఆరోపించారు.
రామకృష్ణ సైతం సోషల్ మీడియాలో తనను కులానికి అంటగట్డడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలకు సీఎం జగనే స్వయంగా ఊపిరిలూదారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే కులం అంటగట్టడమేంటని మండిపడ్డారు. కమ్మ నాయకులు ప్రభుత్వాన్ని తప్పుబట్టకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్లకే పెద్దపీట వేస్తూ మిగిలిన కులాలకు ఇచ్చిన పదవులన్నీ నామమాత్రమేనని దుయ్యబట్టారు.