జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చెందినప్పటికీ ఆయన రాజకీయాల్లో ఆత్మవిశ్వాసంతో నిలదొక్కుకోవడం మరియు ఇంకా కొనసాగడం అనేది నిజంగా ప్రశంసనీయమైన విషయం. అయితే తన పూర్వపు తప్పుల నుండి పవన్ నేర్చుకున్నారా అని జనసైనికులు అడిగితేనే వారంతా విశ్వాసంగా ‘అవును’ అని చెప్పలేని పరిస్థితి. కేడర్ మొత్తాన్ని ఒక చోటికి చేర్చలేడని మరియు తరచూ తానొక్కడిని రాజకీయాల్లో ఉన్నానని ప్రజలకు చెప్పలేకపోతున్నాడు అన్నవి ఎప్పటి నుండో పవన్ పై ఉన్న విమర్శలు.
అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని టాపిక్ మళ్లీ తెరమీదకు వచ్చింది. గవర్నర్ బిశ్వభూషణ్ ఒక రెండు మూడు రోజుల్లో రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఆమోదముద్ర వేసింది లేనిది తెలిసిపోతుంది. ఈ సమయంలో అటు వైసిపి వారు మరియు టిడిపి వారు సాధ్యమైనంతగా తాము కరెక్ట్ అంటే తాము కరెక్ట్ అని ప్రజలముందు గగ్గోలు పెడుతున్నారు. అయితే పవన్ దగ్గర ఈ విషయంలో మంచి క్లారిటీ ఉన్నప్పటికీ…. రాజధాని గురించి అయోమయంలో ఉన్న ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడానికి జనసేన అధ్యక్షుడు ప్రయత్నించడమే లేదు.
తాజాగా ఒక ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ జనసేన పార్టీ సోషల్ మీడియా పేజీల్లో బయటకు వచ్చింది. అందులో పవన్ గతంలోనే తాను టీడీపీతో పొత్తు లో ఉన్నప్పుడే రాజధాని కోసం రైతుల వద్ద నుండి 33 వేల ఎకరాలు సేకరించడం తప్పు అని రైతుల వైపు నిలబడడం గుర్తు చేశారు. వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చిన రైతుల భవిష్యత్తును మరియు వారు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా మూడు రాజధానులు ప్రపోజ్ చేయడం వైసిపి మరొక పెద్ద తప్పు అని పవన్ అన్నారు. గతంలో చంద్రబాబు సింగపూర్ లాంటి రాజధాని కావాలని చెప్పినా కూడా అలాంటి రాజకీయ విధానం ఏపీలో లేదని చెప్పిన ఆయన ఈ సారి వేరే తరహా లో అధికార వికేంద్రీకరణ అని చెప్పి ప్రజలకు మూడు రాజధానుల కాన్సెప్ట్ ను వారి రాజకీయ స్వలబ్దికోసం అమ్మడం కూడా చాలా పెద్ద తప్పు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టి మైకుల ముందు వైసిపి, టిడిపి నాయకులు రాజధాని విషయంలో సమర్ధించుకునే పాయింట్స్ కన్నా పవన్ వి చాలా లాజికల్ గా గా ఉన్నాయన్నది అలాగే ఈ వ్యాఖ్యలు అతనిలోని ముందుచూపుని తెలియజేస్తున్నాయన్నది చాలామంది అభిప్రాయం. అయితే ఈ విషయాన్ని ఎక్కడో తన ఇంటర్వ్యూలో చెబితే ప్రజలకు ఏమి అర్థం అవుతుంది..? గవర్నర్ దీనిపై ఆమోదముద్ర వేసే సమయంలో రాష్ట్ర పరిస్థితులు ప్రభావితం చేయగలిగే విషయాలు తన వద్ద ఉన్నాయి కానీ అవన్నీ అతని తరపు నుండి బయటకు వచ్చి ప్రజలకు తెలియకపోతే ఆయన రాజకీయ మేథాసంపత్తి ఉపయోగమేమి?
వచ్చి రెందు పార్టీలను తనకున్న బలగంతో ఇప్పుడే నిలదీయకుండా అంతా అయిపోయిన తర్వాత తరువాత రోడ్డు మీదకు వచ్చి జనాల్ని వెంటేసుకొని ఎన్ని ఉద్యమాలు చేసినా వేస్ట్ అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉద్యమాలకి ఇది సమయం కాకవచ్చు కానీ పవన్ తలుచుకుంటే తన వాయిస్ గవర్నర్ ఆఫీస్ చేరదా?